Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (తెలుగు)

రెండుగా విభాగము చేయవచ్చును. 1. మెకంజీయుగము 2. బ్రౌనుయుగము.

1. మెకంజీయుగము : (క్రీ. శ. 1720-1840) ఈ కాలమున వెలువడిన గ్రంథములు క్రైస్తవ మతమునకు సంబంధించినవి. సాహిత్యకముగా వీటికి ప్రాధాన్యము లేకపోయినను ఇవి వ్యావహారికమై, సులభగ్రాంథికముగా నున్న రచనము లగుటచే వచనములుగా చెప్పదగినవి. క్రైస్తవమత సంబంధమైన ఈ సాహిత్యమువలన ఆంధ్ర భాషకు ముద్రణ సౌకర్యము లభించినది. మొదట ఈ కాలమున క్రైస్తవ గ్రంథములు ముద్రణము నొందినవి. రానురాను ఇతర గ్రంథములు కూడ ముద్రింపబడ సాగినవి. తెలుగుభాష కీ మహావకాశము లభించుట క్రైస్తవ గ్రంథములవలననే. ఈ కాలమున ఈ క్రింది గ్రంథములు ప్రచురితములైనవి. 1. క్రైస్తవపురాణకథాసంక్షేపము (1720), ఆ.పి. మిషన్ వారిది. 2. బెంజిమనుషూల్జి వ్రాసిన మోక్షానికికొంచుపొయ్యేదోవ (1746) 3. ఎ.డి. గ్రాంజెన్ అనువదించిన మార్కు, మత్తయి, లూకా సువార్తలు (1812). 4. ఏసుప్రభువు. రక్షకుని నూతననిబంధన— ఇవి గ్రీకు భాషనుండి ఎడ్వర్డ్ ప్రిచ్చెట్ గారు అనువదించినవి (1818).

2. బ్రౌనుయుగము : (క్రీ. శ. 1840-1860) ఈ కాలమున పేర్కొనదగిన గ్రంథము జ్ఞానబోధము. ఇది క్రీ. శ. 1840లో ప్రచురితము. ఇది క్రైస్తవ గ్రంథము. తమిళము నుండి యనువదించబడినది. ఇది బైబిలు గ్రంథమున కనువాదము కాదనియు, క్రైస్తవ మతమునకు సంబంధించిన నీతులను గురించి వర్ణించు గ్రంథ మనియు బ్రౌనుగారు వ్రాసిరి. ఇది వ్యావహారిక భాషలో నున్నది.

కథావాఙ్మయము: ఆంగ్లేయు లాంధ్రదేశమున ప్రభుత్వోద్యోగులుగా నుండుటచేత వారు తెలుగుభాష నేర్చుకొన వలసివచ్చినది. సులభముగా నున్న భాషలో రచింపబడిన తెలుగు కథలు ఆంధ్రీతరుల నాకర్షించుటచే కొంత క థా సాహిత్యరచన జరిగినది. ఈ క్రిందివి ముఖ్యమైనవి :

విక్రమార్కుని కథలు, పంచతంత్ర కథలు – ఈ రెండు గ్రంథములను ఫోర్టు సెంటు జార్జి కళాశాలలో ఆంధ్రోపాధ్యాయులుగా నుండిన రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు రచించిరి. క్రైస్తవ సాహిత్యేతర గ్రంథములలో ముద్రణమునందిన ప్రథమ గ్రంథము 'విక్రమార్కుని కథలు'. ఇది క్రీ. శ. 1819 లో ముద్రితమై, 1828, 1850, 1858 సంవత్సరములలో పునర్ముద్రితమైనది. ఇందు విక్రమార్కుని సాహసగాథలు సరళ భాషలో వర్ణితములైనవి. పంచతంత్ర కథలు సంస్కృత గ్రంథమునకు అనువాదము. ఇది 1834 లో ప్రచురితమైనది. ఈ సందర్భమున పాటూరి రామస్వామి రచించిన శుక సప్తతి కథలు (1840), ధూర్జటి లక్ష్మీపతి వ్రాసిన 'హంస వింశతి' (1842), వాడ్రేవు వెంకయ్యగారి బత్తిసుపుత్లీ కథలు (1847) మున్నగునవి పేర్కొనతగినవి.

ఈ కాలముననే కొన్ని పురాణములు, ప్రబంధములు కూడ వచనమున రచితములైనవి. అందు సింగరాజు దత్తాత్రేయులు, వెంకటసుబ్బయ్య రచించిన రామాయణ వచనము (1840), పైడిపాటి పాపయ్యవ్రాసిన రంగనాథ రామాయణవచనము (1840), పాటూరి రంగశాస్త్రులు లిఖించిన విజయవిలాసము (1841), వైయాకరణము రామానుజాచార్య కృతమైన ఆదిపర్వవచనము (1847), ముదిగొండ బ్రహ్మలింగారాధ్యులుగారి శివరహస్య ఖండము (1852) ముఖ్యములైనవి.

యాత్రా చరిత్రలు : ఈ విభాగమున ప్రప్రథమమున పేర్కొనదగినది ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్రా చరిత్ర. వీరాస్వామయ్యగారు కాశీయాత్ర చేసిన సందర్భమున ఈ గ్రంథమును దినచర్యారూపమున సరళ వ్యావహారిక భాషలో రచించిరి. దీనిని వారి మిత్రులు కోమలేశ్వరపు శ్రీనివాస పిళ్ళెగారు క్రీ. శ. 1830 సంవత్సరమున ముద్రింపించిరి. ఇదిగాక కోలా శేషాచల కవి “నీలగిరియాత్ర" కూడ ఈ సందర్భమున చెప్పతగినది. శేషాచల కవి థామస్ సిమ్సన్ అను ఆంగ్లేయుని వెంట నీలగిరి (ఉదకమండలము) యాత్ర చేసి రచించిన గ్రంథమిది. ఇది ప్రౌఢశైలీ సమన్వితము. క్రీ.శ. 1846-1847 మధ్యకాలమున రచితమైనది; విశాఖ జమీందారగు గోడే శ్రీ వేంకట జగ్గ నృపాలున కంకితమైనది.

పత్రికా ముఖమున గూడ కొంతవచన రచన ఈ కాలమున జరిగినది. 19 వ శతాబ్దపు ప్రథమార్థమున పేర్కొనదగిన తెలుగు పత్రిక 'వర్తమాన తరంగిణి.' ఇందు వివిధ సాహితీ ప్రక్రియలు ప్రచురితములైనవి. ముఖ్యముగా

287