పుట:SamardaRamadasu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముత్యములు, మొహిరీలు విశేషముగ సమర్పించెను. అభిషేక విధి సమయమున శివాజీ యొక లక్షరూపాయల విలువగల వెండి బంగారు నాణెములను గురువు శిరస్సున నభిషేకము చేసెను. ఈ గురుసందర్శనము 1649 సం. ఏప్రియల్ 12 వ తేదీని జరిగెను. తెలుగు తేదీ ప్రకారము విరోధినామ సం. వైశాఖ శుద్ధ నవమి గురువారమునాడు జరిగెను. గురుపూజా నంతరమున శివాజీ చేతులు జోడించుకొని నిలువబడి తన్ను దీవించి పరమార్థ విషయముల నుపదేశింపు మని గురువును వేడుకొనెను. శివాజీ నోట వెడలిన మాట లన్నియు వ్రాసియుంచుమని రామదాసు శిష్యు డైన కళ్యాణస్వామిని నాజ్ఞాపించెను. కళ్యాణస్వామి వ్రాయుటకు సిద్ధమైన తరువాత రామదాసుడుపదేశమును జెప్పి వ్రాయించెను. రామదాసుడు శివాజీని దీవించి యతనికి నొక కొబ్బరికాయయు గుఱ్ఱపులద్దెయు విభూతియు కొన్ని గులకరాళ్ళను ఇచ్చెను. ఈ విపరీత బహుమానముల యొక్క అర్థము సామాన్యముగ నెవరికి దెలియలేదు. ఆ బహుమానములను శివాజీ తన తల్లికి జూపినప్పు డామెయు వాని యర్థమును దెలియక పోయెను. అప్పుడు శివాజీ యా సమస్య నిట్లు విప్పి చెప్పెను. "గుఱ్ఱపులద్దె వలన గుఱ్ఱపుదళము వృద్ధియగుగాక యనియు విభూతివలన భూమి చాల జయింతువుగాక యనియు గులకరాళ్లవలన బలుకోటలు నిర్మింతువుగాక యనియు నర్థము" అని చెప్పెను. రామదాసుడు చేసిన యాత్మ జ్ఞానోపదేశము శివాజీ హృదయమున వైరాగ్య మహాగ్నిని రగులు కొలిపెను. సహజముగనే యాత్మజ్ఞాన శక్తి గల చిత్తము ప్రబుద్ధమై యప్పుడు శివాజీ యిట్లనియెను. "స్వామీ! తేజోమయములైన మీవాక్యములు వర్ణనాతీతమైనవి. వినశ్వరములైన యీ భౌతిక విషయములను విడచుటకు నే నాతురపడుచున్నాను. మీప్రియశిష్యుల వలెనే నేను గూడ నొక సన్యాసిని గావలెనని యున్నది అట్లనుగ్రహింపుడు. ఈ రాజ్యాంగవిషయసంకటము లికజాలును. నేను జేయవలసిన దేదో చేసియుంటిని. రాజ్యవిషయములం దాసక్తి గలవారు దానిని బూని తక్కిన పని చేయుదురుగాక!" ఆ మాటలు విని రామదాసుడు నవ్వి యిట్లనియె "శివబాబా, నీవు క్షత్రియుడవు. రాజ్యపాలనము, ప్రజారక్షణము, ఈశ్వరసేవయు నీ ధర్మములు. కావున