పుట:SamardaRamadasu.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఠాధికారిణియై పెత్తనము చేయుచుండెను. రామదాసుడు వచ్చువఱకు నచటనుండి భోజనము చేయుమని యామె ప్రార్థించెను. శ్రీరామదాసుని యాశీర్వచనము బడయువఱకు దా నన్న పానాదులు ముట్టనని ప్రతిజ్ఞ చేసినట్లు శివాజీ యామెతో జెప్పెను. సరిగ దారిచూపుట కొక శిష్యుని వెంట బెట్టుకొని షైగాన్‌వాడి మఠమునకు బొమ్మనియు నచ్చట రామదాసుని దర్శనము తప్పక దొఱకు ననియు నామె చెప్పెను. శివాజీ షైగాన్‌వాడీ వెళ్లుసరికి రామదాసుడు కొండక్రింద నొక లోయలోనున్న యొక తోటను జూడబోయెను. కళ్యాణస్వామి యను శిష్యుడు శివాజీ రామదాసునకు వ్రాసిన జాబు నప్పుడు చదువుచుండెను. కళ్యాణస్వామి శివాజీ చెయ్యిపట్టుకొని గురువు నొద్దకు తీసికొని పోయెను. శివాజీ వినయముతో నమస్కరించి చేతులు జోడించుకొని వాని యెదుట నిలిచెను. "ఆహా! నీవు నీ జాబు నొక్కసారియే వచ్చినవని" రామదాసు వానిని బలకరించెను. "నేను జిరకాలమునుండి నీ దేశములో నివసించుచున్నాను. నీవు నా యోగక్షేమము లరయుచున్నందులకు నేను చాల సంతోషించు చున్నాను." తన్ను గుఱించి శివాజీ యే మాత్రము కనుగొనుట లేదని యతనిని దెప్పుటకై యీ మాట రామదాసు పలికెను. శివాజీ తలవంచుకొని పశ్చాత్తాపపడుచు నిట్లనియె. "స్వామీ! నేను మిక్కిలి పాపాత్ముడను. నే జేసిన తప్పులన్నిటిని మీకృపాతిరేకమున క్షమింపుడు." శివాజీయొక్క వినయ విధేయతాదులను గనుగొని యుపదేశము పొందుటకు సిద్ధముగ నుండుమని రామదాసు యాజ్ఞాపించెను. శివాజీ వెంటనే తన వెంట వచ్చిన బాలాజీకిని నీలవంతునకును బూజా ద్రవ్యములు తీసికొని రమ్మని వర్తమాన మంపి తాను స్నానమునకై పోయెను. పూజాద్రవ్యములు రాగానే రామదాసుడు శివాజీని గొండశిఖరముమీద నొక మూలకు దీసికొనిపోయి యుపదేశము చేసెను. ఈ యుపదేశ కార్యమెన్నడు బహిరంగముగ జరుపబడలేదు. రామదాసు శిష్యులలో నొక డగు దివాకర్‌భట్ శివాజీ రామదాసునకు జేసిన పూజాసమయమున బురోహితుడై పూజామంత్రముల జదివెను. శివాజీ పూజాకాలమున గురువర్యు డగు రామదాసునకు విలువగల జరీబట్టలు, పట్టుబట్టలు, నగలు, రత్నములు,