పుట:SamardaRamadasu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరమాత్ముని యపరావతారమని యా దేశస్థులు గాడముగ విశ్వసింతురు. ఈనాటి హేతువాద పరాయణులు రామదాసుడు భగవంతుని యవతారము కా దనియు నతడు పవిత్ర చరితుడైన యొక ఋషియనియు నొప్పుకొందురు. మహిమలు మొదలయిన యమానుష కృత్యములు దీసివేసిన యెడల వా రాతని చరిత్రము నాదరభావమున జూతురు. అతిశయోక్తులు, మహామహిమలు దూరముగా ద్రోసివేసిన యెడల రామదాసుడు రచియించిన దాసబోధ యను గ్రంథము నుండియే యాతని చరిత్రమును మనము గ్రహింపవచ్చును. అదృష్టవశమున దాసబోధలో శిష్యులు గాని మరి యితరులు గాని రామదాసు రచియింపని క్రొత్త పద్యములను జేర్చలేదు. ఈలాగున జేర్చుట మన పురాణములలోను భారత రామాయణాది గొప్ప గ్రంథముల లోను జరిగినది. అట్టి యవస్థ దాసబోధకు బట్టలేదు. ఆ కారణమున నది విశ్వసింపదగిన గ్రంథముగ నున్నది. ఇతరులు వ్రాసిన యతని జీవిత చరిత్రముకంటె దాసబోధనే మన మాధారముగ జేసికొని యతని జీవితచరిత్రము గొంతవఱకు లిఖింపవచ్చును. రామదాసునియొక్క అభీష్టదైవతము మారుతి, అనగా హనుమంతుడు. హనుమంతుడే రామదాసున కాదర్శదైవతము. నిరాడంబర జీవనము గంభీరమైన తత్త్వవిచారము ముఖ్యముగ నుండవలయు నని రామదాసునియొక్క యాశయము. గంభీరమైన తత్త్వవిచారమునకు నాదర్శమైన దైవతముండితీరవలెను. ఆ దైవతము రామదాసు మత ప్రకారము మహోత్కృష్ట పురుషుడైన హనుమతుండే. హనుమంతుడు శ్రీరామభక్తు డని జగత్ప్రసిద్ధమేగదా! అటువంటి మహాదైవతము నందు విశ్వాసము లేకపోవుటచే మహారాష్ట్ర దేశము బహు కష్టముల పాలైనది. ఈ దైవతమును నమ్మిన తరువాత జనుల కనేక కష్టములు దొలగినవి. మారుతి బలభీము డని రెండవ పేరు గలదు. ఈ దైవతమును రామదాసుడు పండ్రెండు సంవత్సరములు ధ్యానించి తుదకు మారుతిలో లీనములై యున్న మహాశక్తులను గొన్నింటిని దనయందు సంక్రమింప జేసికొనెను. జనులను మహోత్సాహభరితులను జేయవలసి వచ్చినప్పుడు మారుతియే పరమదైవతమని జనులకు బోధించెను. ఆతడు దుష్టజన భయంకరు డని మహాభక్తు డని గొప్ప