పుట:SaakshiPartIII.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన వచన కవిత్వము వ్రాయకపోవచ్చును. గాని వచనమున గవిత్వము వ్రాసిన వారు.

పానుగంటివారిని వచన యోధులని చెప్పవలెను. మనము చెప్పనవసరము లేదు. ఈ వాక్యములు పల్కుచున్నవి.

"వచనము వ్రాయువారిని దీసివ్రేత సరకుగ గుక్కమూతి పిందెగ దృణీకరింప న్యాయమా? పద్యమున గవిత్వముండి వచనమున లేకుండునా? ఎచ్చట రసముండునో అచ్చటనే కవిత్వమున్నది. అన్ని నాగరక దేశములందు గూడ వచన ప్రబంధములు లక్షోపలక్షలుగా వృద్ధి పొందుచున్నప్పుడు మన దేశమందట్లు జరగకపోవుట కడుశోచనీయము గాదా?

వచన గ్రంథ రచనా బాహుళ్యము గాని భాష యభివృద్ధి పొంద నేరదు"-

ఇవి నాటుకొనవలసిన మాటలు.

వీరేశలింగమువారు, చిలకమర్తివారు, పానుగంటివారు-వీరందఱూ ఒఠి రచనలను చేయుట కాదు, భాషా వికాసమునకు, సాహిత్య సమున్మీలనమునకు, దేశ ప్రయోజనములకు పాటు పడుట వారి రక్తమున నున్న అంశములు. వర్తమాన రచయితలు వారి ఆదర్శస్ఫూర్తి పొందవలసిన జాత్యవసరమున్నది.

వెగటుదనము, పచ్చి శృంగారము లేకుండగ హాస్యము పుట్టించు పానుగంటి సాక్షి రచనలలో-ఉల్లేఖించివలసినచో సవాలక్ష కన్పడును. విజ్ఞానము, పరిశీలనము అనునవి పానుగంటి వారికి రెండు కన్నులుగ రచనకు దారులు చూపించినవి. తోలు బొమ్మలాటలో బాటలు పాడు ఆడుదానిని పరిశీలనాత్మకముగా వర్ణించు సందర్భమున "గ్రామమున రాత్రివేళ యందది యేమూల బాడుచున్నను గ్రామమంతయు దాని కంఠము వినిపించును. చెక్కుచెదరలేదు. నలి లేదు. తొలి లేదు. బొంగు జీరలేదు. అపస్వరము వెలితి లేదు. 'కై' మనిన నక్షత్ర మార్గమున గఱ్ఱుమని తిరుగుచు బలిటీలు గొట్టును. సంగతుల పై సంగతులు పూలు చల్లినట్లది వర్షించును" అనుటలో చివరి వాక్యములు కవి వాక్యములు.

పానుగంటి వారి ఆలోచనలు దేశీయమైనవి. సాహిత్యరంగమున, సంఘ సంస్కరణమున మాత్రమే కాదు; పారిశ్రామిక రంగమున కూడ మనదేశము అభివృద్ధి గాంచవలెనని నేసి యంత్రములు చేయలేని వస్త్రోత్పత్తిని చేయ మన వారి నేర్పు నాయన ఎన్నియో వాక్యములలో ప్రశంసించినారు. ఇప్పుడైనా కన్నులు తెఱవరా? స్వదేశ పరిశ్రమ విద్యా సంరక్షణ మాచరించరా? మీ ధనము మీలో నుండునట్లు చేసికొనరా? అని ప్రశ్నించినారు. దేశభక్తి-స్వార్థ త్యాగము వ్యాసము పానుగంటి అంతరంగమునకు వేదిక వంటిది. మాతృభక్తి, పితృభక్తి వంటివి లేకనే దేశభక్తి యుండుట, కల్గుట వీలుకాదని నొక్కి చెప్పుచు నిజమైన దేశభక్తుల అవసరము తెలుపుచు దేశభక్తి, ప్రదర్శనముగా నుండరాదని అభిప్రాయపడినారు.

"బజారులో దేశభక్తులు. మంద బయట దేశభక్తులు. ఇంటిలో దేశభక్తులు. దొడ్డిలో