పుట:Ranganatha Ramayanamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శ్రీరంగనాథరామాయణము

ద్విపద



రాముని మిథిలానగరమునకుఁ బోవ మునులు ప్రేరేపించుట

మొదలైనవారికి ము న్ననేకులకు - నది యెత్త నెక్కడ నలవి గాకుండ
నట్టివిల్లును బట్టి యటు లెక్కుపెట్టి - గట్టిగా నెత్తిన ఘనునకు నతఁడు
తనకూఁతు నిచ్చెదఁ దప్పక నేను - ననుచున్నవాఁ"డని యందఱు నపుడు
"జననాథ యాశరాసనలలామంబు - జనకునిజన్నంబు చనుఁ జూడ నీకు"930
ననుచు విశ్వామిత్రుఁ డాదిగా సకల - మునులు నావీరోత్తముల దాశరథుల
లలితపుణ్యుల మిథిలాపురంబునకుఁ - జెలువారఁ బయనంబు సేసి సమ్మదము
నొంది, భాగీరథియుత్తరతటము - జెంది, హిమాద్రియు సిద్ధాశ్రమంబు
వలపట నిడి, యక్షవల్లభుదిశకుఁ - బొలుపారఁ బొందిన భూరిమార్గమున
మూడుయోజనములు మూఁడుజాములకు - నాఁ డేగి యట శోణనదముతీరమున
విడిసి తీర్థస్నానవిహితకర్మములు, నడిపి రమ్యస్థలి నరనాథసుతులు
సంతోషమున మునీశ్వరులతో నుండి - రంత కౌశికుఁ జూచి యారాముఁ డనియె.

కౌశాంబివృత్తాంతము

“గరము ప్రజావృద్ధి గలుగు నీదేశ - మరయ నెవ్వరిదేశ? మానతిం" డనిన
"భూనాథ విను బ్రహ్మపుత్త్రుండు కుశుఁడు - నా నొక్కముని మహోన్నతకీర్తి గలఁడు
అతఁడును వైదర్భి యనునింతివలన - సుతుల నల్వుర గాంచె సురుచిరాకృతులఁ940
బ్రశమితాత్ముల ధూర్తరజసుఁ గుశాంబుఁ - గుశనాభు వసువు నక్కొమరులు మిగిలి
యనివార్యశౌర్యులై యనుపమలీలఁ - దనరు మహాక్షత్రధర్మంబు నడుపఁ
గొడుకులచరితంబు గుణములు చూచి - యడరు సంతసముతో నాకుశుం డనియె.
“నిలఁ బ్రజాపాలనం బెలమి గావింపఁ; - డలఘుకీర్తులు గల్గ" నన ముద మంది
కౌశలంబున నొప్పు నాకుశాంబుండు - కౌశాంబి యనుపేరుఁ గావించెఁ బురము
దశరథాత్మజ మహోదయ మనుపురము - కుశనాభుఁ డొనరించె గుశలుడై ధరణి
శూరుండు ధూర్తరజుండు నిర్మించె - నారంగపురము ధర్మారణ్య మనఁగ
వసువు నిమ్ముల గిరివ్రజ మనుపేరఁ - బసదుగ నిర్మించెఁ బట్టణం బొకటి
యిది ప్రీతి నవ్వసుఁ డేలుదేశంబు - ముద మంది గిరులైదు ముందఱ నొప్పె,
నానగమధ్యంబునందును మాగ - ధానామమున నొకతటిని చెన్నొందుఁ950
జాల నమ్మగధదేశం బెల్ల వసువు - పాలించుచుండును బరమధర్మమున
నచ్చెరు వడరంగ నాకుశనాభుఁ - డచ్చరలేమ ఘృతాచియం దెలమిఁ
గన్నులు మరునంపగములు నా నొప్ప - కన్నెల నూర్వురఁ గడురూపవతులఁ
గనియె నత్తరుణులకమనీయకాంతి - వినుతయావనకళావిస్ఫూర్తు లమర
మంజీరమేఖలామధురవాచాల - మంజులకంకణమధుశింజితములు