చుట్టబెట్టి యొకపుస్తకమును నిర్గమనముంచి తెల్లవారినతరువాతనే బైలుదేరుటకు నిశ్చయించిరి. అప్పుడు రామమూర్తిగారు బండి నిమిత్తము వర్తమానము పంపఁబోఁగా వలదని వారించి బండినెక్కి పోయినయెడల యాత్రాఫలము దక్కదు గాన కాలినడకనే పోయెద నని రాజశేఖరుడుగారు చెప్పిరి. ఆ రాత్రియే వారికందఱికిని క్రొత్తబట్టలు కట్టఁబెట్టి, రామమూర్తిగారు ప్రాతఃకాలముననే వారి కంటె ముందుగా లేచి,వారు ప్రయాణమగునప్పటికి సిద్ధముగా నుండిరి. అప్పుడు రాజశేఖరుఁడుగారు తాము ధవళేశ్వరమునుండి తెచ్చిన పాత్ర సామాగ్రియు, మంచములను, బట్టల పెట్టెలను తాము మరలవచ్చు వరకును భద్రముగా జాగ్రత్త చేయవలయునని రామమూర్తిగారికి చెప్పి యొప్పగించి, దారి ప్రయాణమునకు ముఖ్యముగా కావలసిన వస్తువులను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగువారు బైలుదేరునపుడు రామమూర్తిగారి భార్య వీధి వరకును వచ్చి వారు దూరదేశయాత్రను జేయఁబూనుటను దలచు కొని కంటఁదడిబెట్ట మొదలుపెట్టెను. అప్పుడు వారందఱును గుమ్మములో నున్నవారియొద్ద సెలవు పుచ్చుకొని, ఒంటి బ్రాహ్మణుఁ డెదు రుగా వచ్చుచుండఁగా నతఁడు పోవువరకును నిలిచి యావల నొక పుణ్యస్త్రీ రాఁగా మంచి శకునమయినదని దారిసాగి నడువనారంభించిరి. రామమూర్తిగారు వారి నూరిబయలవరకును సాగనంపి దూర దేశప్రయాణమును జేయుచున్నారు గాన భద్రముగా వెళ్ళుఁడని బుద్ధులు చెప్పి వెనుకకు మరలి యింటికి వచ్చిరి. రాజశేఖరుఁడుగారు త్రోవ పొడుగునను చెట్లు మొదలగు వానిని భార్యకును బిడ్డలకును జూపుచు దారి నడువసాగిరి.
రాజ__చూచితిరా యీ మఱ్ఱిచెట్టు ఆమూలాగ్రము చిగిరించి, పగడములవలె నున్న యెఱ్ఱని పండ్ల గుత్తులతో నెంత మనోహరముగా నున్నదో!
సుబ్ర__ఔనౌను, దానిచేరువ నున్న మామిడిగున్న చీనాంబరమువలె నున్న లేఁత చిగుళ్ళతో మఱింతవింతగా నున్నది. కొన