పుట:Prasarapramukulu022372mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

53

ఉషశ్రీ (1928-1990)

'ఉషశ్రీ' అనబడే పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు 1928లో కాకరపర్రులో జన్మించారు. తండ్రి పురాణపండ రామమూర్తికి 'గురువు'గారని పశ్చిమ గోదావరి జిల్లాలో మంచిపేరు. గజారోహణం, స్వర్ణపతక సన్మానం పొందిన సుప్రసిద్ధ పౌరాణికులు రామమూర్తిగారు. వారి కుమారులలో రాధాకృష్ణమూర్తి రాజమండ్రిలో ప్రవచనాలు చేస్తూ యశస్సు సంపాదించారు. రంగనాధ్ జర్నలిస్టుగా, నాటక రచయితగా పేరు తెచ్చుకొన్నారు.

ఉషశ్రీ అందరిలోకి పెద్ద కుమారుడు. ఆలమూరు, భీమవరం, కాకినాడలో విద్య గడించారు. విశ్వనాథకు ప్రియ శిష్యుడుగా పేరు తెచ్చుకొన్నారు. రచయితగా పేరు గడించారు. ఉద్యోగపర్వం 1961 లో హైదరాబాదులో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఆరంభమైంది.

1965లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో చేరారు. ఆ తర్వాత సీనియర్ స్క్రిప్ట్ రచయితగా విజయవాడ బదిలీ అయ్యారు. పురాణ ప్రవచనంలో తనకు తానే సాటిగా, గంభీర స్వరంతో 'ధర్మ సందేహాలు' కార్యక్రమం దశాబ్దిపైగా నిర్వహించారు. రామాయణ, భారత, భాగవతాలను అరటిపండు వొలిచినట్లు ఒక దశాబ్ది (1974-84) ప్రవచించి ప్రసంగాలకు కొత్త వొరవడి తెచ్చారు. వ్యావహారిక శైలికి భాష్యం చెప్పారు.

1975లో తెలుగు ప్రసంగ శాఖ ప్రయోక్తగా విజయవాడలో పదోన్నతి పొంది 1986లో రిటైరయ్యేంతవరకు ఆపదవిలో కొనసాగారు. జ్వరితజ్వాల, అమృతకలశం, మల్లిపందిరి, రాగహృదయం ఆయన రచనలు, రామాయణ, భారత, భాగవతాలను వచన రూపంలో తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. వ్యాఖ్యాతగా ఆయన కాయనేసాటి. హేతువాద దృష్టితో పురాణాలకు భాష్యం చెప్పే తీరు ఆబాలగోపాలాన్ని మైమరపింప జేసెది

రేడియో కళాకారులలో మిమిక్రీ చేయడంలో ఉషశ్రీవి మొదటగా ఎన్నుకొనేవారు. 1990 సెప్టెంబరులో ఆయన గళం మూగపోయింది.