పుట:PandugaluParamardhalu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చైత్ర శుక్ల తదియ

శివడోలోత్సవము, సౌభాగ్యగౌరీవ్రతం, ఉత్తమమన్వాది.

చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులు తొమ్మిది రోజులలో ఇది మూడోరోజు. వసంత నవరాత్రులు వసంతోత్సవానికి ప్రత్యేకింపబడ్డవి కదా ! అయినా ఆ నవరాత్రులలో ఈ మూడో రోజు ప్రత్యేకం ఒక పర్వమై ఉంది.

ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శివడోలోత్సవం, సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మాసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని వ్రాస్తారు.

చైత్ర శుక్ల తదియ నాడు శివడోలోత్సవమున్నూ, చైత్ర శుక్ల ఏకాదశినాడు విష్ణుడోలోత్సవమున్నూ ఏర్పాటై ఉన్నాయి. శివడోలోత్సవమునాడు ఉమా శివులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని ఆందోలన వ్రతమంటారు. ఈ వ్రతానికి విదియతో కూడిన తదియ పనికిరాదని, చవితితో కూడిన తృతీయ ముహూర్త మాత్రం ఉన్నా గ్రాహ్యమని స్మృతి కౌస్తుభం.

ఈ డోలోత్సవ పర్వం హిందూదేశంలో పలుప్రాంతాల్లో పలురీతుల ఆచరింపబడుతూ ఉంది. ఆ ఆచరణ ఆయా ప్రాంతాల్లో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ పండుగ స్త్రీలలో ఎక్కువగా ఉండడమే కాదు ప్రత్యేకం స్త్రీ దేవతపేర సౌభాగ్య గౌరీవ్రతం మున్నగు నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది.

ఈ పర్వం గౌరీ నామంతో చెలామణీ కావడానికి కారణం ఉంది. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఆనాడు గౌరి పేరజరిగే ఒక పర్వమైంది. శివడోలోత్సవంలో ఉమా శివులకు దమనముతో పూజ ప్రధానమని ఎలిసికొని ఉన్నాము. ఈ పూజ కాలక్రమాన సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, మాసగౌరీ వ్రతం