పుట:Narayana Rao Novel.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముచ్చట్లు

59

వెంకాయమ్మ: ఏమి కబుర్లు చెప్పిందేమిటే సూరీడూ!

ఇంతలో జానకమ్మ గారి రెండవ వియ్యపురాలు, వెంకాయమ్మ అత్తగారు, వచ్చి ‘ఏమండీ వదినా, ఈ రోజున యింకా పెళ్లికూతుర్ని తల దువ్వటానికి తీసుకు రాలేదు. ఊరిలో వార్నందర్నీ , బంతులాడించటమునకు పిలిచాము. మేమంతా ముస్తాబయ్యాము. మీరూ, మీ అమ్మాయిలు సోది పెట్టుకు కూచున్నారు అన్నది.

జాన: మా పెద్దమ్మాయి, సూరీడూ వెళ్లి పెళ్ళికూతుర్ని తీసుకువస్తారు. సత్యవతీ మాణిక్యం మీరంతానున్ను పెళ్ళి వార్నందర్నీ పేరంటానికి పిలవండి. సావిత్రీబాయి సంగీతపు కచ్చేరట! ఆడవాళ్ళకి ప్రత్యేకం. ఇది పెళ్ళికొడుకు గారి అరణ్యమెంటు. లెండఱ్ఱా, ఎవరిపనులు వారు చెయ్యండి మూడయ్యింది అప్పుడే.

ఆ నాల్గవ నాటి సాయంత్రం ఊరిలో ఆడవారికిమాత్రము అచ్చుకార్డులు పంపినారు. ఈ పద్ధతి అంతయూ నారాయణరావు పరమేశ్వరమూర్తి లక్ష్మీపతులు చేసిన ఆలోచన. దగ్గరచుట్టాలను, పెద్దలఇండ్లలో నాడంగులను మూడు మోటారుకార్లమీద జానకమ్మగారు, శ్రీరామమూర్తి భార్య, సూర్యకాంతము, మాణిక్యాంబ, శ్రీరామమూర్తిఅత్త గారు, వెంకాయమ్మ అత్తగారు వెళ్ళి పిలిచివచ్చినారు.

విడిదిలో మధ్యహా లతి సౌందర్యముగ పెళ్ళికొడుకు, బరమేశ్వరుడు నలంకరింపించినారు. వచ్చిన స్త్రీమండలి వీలుగా కూర్చుండుటకు విచిత్రముగా నాసనము లమర్పించినారు. విసనకఱ్ఱలతో విసరుటకు పనికత్తెల నేర్పాటు చేయించినారు.

వేరేగదులలో వచ్చిన వారందఱకు నుపాహారములు, కాఫీ, పండ్లు నిచ్చిరి. తాంబూలములు, కర్పూరపు దండలు, చక్కని పూవులద్దిన ఖద్దరు రవికలు, వెండికుంకుమబరిణెలు, పూవులగుత్తులు బొట్టుపెట్టి స్త్రీమండలికి నర్పించినారు. జడ్జీ భార్య, ఆంగ్ల సబుకలెక్టరుభార్య, మొదలగు గొప్పవారందరును వచ్చిరి. ఈ పద్ధతి నవీనముగా నుండుటచే, ఆడపెండ్లివారి వనితామణులందరు విచ్చేసిరి. వచ్చిన బాలబాలికలందరకు చక్కని వెండి బొమ్మ లర్పింపబడినవి. సెంటుబుడ్లు అందరకు నిచ్చినారు. జేబురుమాళ్ళిచ్చినారు. సావిత్రి ఆరోజున తన గానవిద్యాప్రౌఢిమ నానంద ప్రవాహముల బరపినది. ఆమెకంఠము వీణతీగయినది. ఆ మధుర దివ్యగాంధర్వములో వధూవరు లిర్వురు లీనమైపోయినారు. సంగీత కళాపాసకులగు నీ నూత్న దంపతుల యానందములో దివ్యత్వము జూరగొన్నది సావిత్రి.