పుట:Narayana Rao Novel.djvu/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంపపెట్టు

397

ఆమెకు హృదయములో నారాయణరావు, బయట మోహవ్యాధుడు మోహనుడు.

ఆమె మెట్లు సమీపించినది. ఆత డామెను జేరినాడు.

‘శారదా? అని వినబడని ధ్వని.

‘ఎవరు!’ అని చకితయై శారద.

‘నేను, ప్రణయేశ్వరీ! నీ బావను.’

అత డామె భుజముపై చేయి వేసినాడు. ఆమె మూర్తిని ముట్టుటతోడనే యాతని ఒళ్ళు వేడెక్కినది. అతడు మోహావేశియైనాడు. శారదను గట్టిగా అదుముకొని కౌగిలించుకొన్నాడు.

ఆమె భయాశ్చర్యములకు లోనై మాటలాడలేకపోయినది. ఆత డామె మూర్తిని మరియు దన ఒడలికి అదుముకొన్నాడు.

ఆమె వ్యాఘ్రముకడ చేష్టలుడిగిన లేడియైపోయినది. జగన్మోహనుడు ఆమె మోము వెనుకకువంచి ఆమెను ముద్దుపెట్టుకొనబోయినాడు. ఆ చీకటిలో ప్రేతముఖమున అతని కన్నులు చింతనిప్పులవలె కణకణలాడుచున్నవి. ఆమె అతని ముఖము తన ముఖముకడకు రానీక చేతులుపెట్టి వెనుకకు నెట్టినది.

అత డామెచేతులు కుడిచేత బలవంతముగ నొత్తిగించి ఆమె పెదవుల కడకు తన పెదవులు జేర్చబోయినాడు. ఆతని నిట్టూర్పులు తన మోముపై బ్రసరించుటయు శారద మహాశక్తియైనది. ఒడలు కంపింప నొక్క ఊపున యాతని కౌగిలి సడలించి, యాతని రొమ్ముపై ఎడమచేయి వైచి నెట్టి, కుడిచేత జగన్మోహనుని చెంపపై ఫెళ్ళున నొక్క పెట్టు పెట్టినది.

అతడు తలతిరుగ తూలి, తెల్లబోయి, మేడ మెట్లకఱ్ఱలనాని తన్ను నిలుపుకొన్నాడు.

శారద చరచర మేడమెట్లెక్కి తన గదిలోనికిబోయి పందిరమంచముపై మేనువాల్చి క్రోధము సడల అవమానము తలచుకొని వెక్కి వెక్కి యేడ్చినది.

శారద చెంపపెట్టు కొట్టు సమయముననే యచ్చటకువచ్చిన మషాల్చీపోతిగాడు ఆదిచూచి ‘ఏమి ఈ వెధవయ్య నాతల్లి శారదపై చేయి వేయుటయె! మంచి పరాభవము చేసింది నాతల్లి’ అని కోపముతోపోయి దాటిచిట్టితో చెప్పినాడు.

దాదిచిట్టి పోయి శకుంతలతో నిది వర్ణించినది. ఆమె రౌద్రమూర్తియై చెల్లెలికడకు బోయి ‘తల్లీ వాడేమిచేశాడే’ యని యడిగినది. శారద దుఃఖ మాపుకొని కోపమురా లేచి యక్కతో జరిగినది చెప్పినది. శకుంతల క్రిందకు దిగి తల్లితో నంతయు జెప్పి, తల్లిరా చరచరనడచి, తన గదిలోనికిబోయి సోఫాపై నధివసించియుండి చెంప సవరించుకొను చున్న జగన్మోహనుని చూచి ‘ఏమోయి! నీ సంగతి బాగుండలేదు. నువ్వు ఇంక మా ఎవరిఇండ్లకు రావద్దు. పొద్దున్నే మెయిలుకువెళ్ళు. మాతో ఎవరితోను చెప్పనక్కరలేదు!’ అనియన్నది.

జగన్మోహనుడు అవమాన రోషాలతో చటుక్కున లేచి సామాను సర్దించుకొని, కారుపై తత్ క్షణమే స్టేషనుకు వెడలిపోయినాడు.