పుట:Narayana Rao Novel.djvu/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

నారాయణరావు

అందరూ గొల్లున నవ్వికొనిరి. ఆ బాలికతో జంటగా గూడవేయు బాలకుని, ‘దానికి ఎదురుపద మాడరా! ఆడూ! లేకపోతే ఓడిపోయినట్టేరో’ అన్నారు.

ఆ యువకుడు తలయూపి,

‘ఎయ్యవే గూడా, నా పిల్లా!
తియ్యని పాటలు పాడేమే

పాటా పాటలో కలిపేస్తే
పరుగిడు నీరూ మళ్ళల్లో!
ఎయ్యవె గూడా నా పిల్లా’

అని పాడినాడు. ‘బాగుందిరా నాగా! బంగారూ! నువ్వురా’ అన్నారు.

బంగారు:

సెపుకుంట మనవీ యినవే
నా సొగసుపిల్ల, నాగోరువంక
సెపుకుంట మనవీ యినవే.

నాకోసం ఎదురుచూచి
నాగుండె తలుసుకోని
పిల్లా నేనొచ్చేయేళ
ఘల్లూమన్నయి మెళ్లోకాసులు
సెపుకుంట మనవీ యినవే...

నీరులేక దాగమేసి
నారు వాడిపోతోఉంది
నారాక, నామాట
నారుమడికీ నీరౌతది
సెపుకుంట మనవీ యినవే...

నారు మొక్క నల్లనే
నాపిల్ల తెల్లనే
నీరొస్తే, నేనొస్తే
మొక్క పచ్చనౌతాది పిల్ల నల్లనౌతాది
సెపుకుంట మనవి యినవే,