పుట:Narayana Rao Novel.djvu/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహపవిత్రత

శారదను జమీందారుగారువచ్చి పరీక్షకు రాజమహేంద్రవరము తీసికొనిపోయినారు.

శారద చెన్నపురిలో నున్నంత కాలము భర్తతో జదువునప్పడుతప్ప, తదితర కాలమం దేమియు మాటలాడలేదు. నారాయణరావు శారదతో మాట్లాడలేదు. చదువు చెప్పునప్పుడు బడిలో నుపాధ్యాయులందరు విద్యార్థుల కేరీతి చెప్పుదురో యంతకన్న నిచ్చట నధిక మేమున్నదని నారాయణరావు తలపోసికొన్నాడు.

శారదయు, దానును బ్రేమతో తమ జీవితనౌక నానందఝురీతరంగములలో వదలినచో ఆ నావ యనంతమగు నే తీరము సేరియుండునో?

నారాయణరావును ప్రజలందరు గౌరవించి ప్రేమించుట శారద చూచినది. నారాయణరావు సౌందర్యవంతుడని, విద్యార్థినులగు బాలికలు, విద్యావంతులగు యువతులు అవిసెచెట్టును నాగవల్లు లలమికొనునట్లు చేరుట గమనించింది. తానీ పురుష శ్రేష్ఠు నేల ప్రేమింప లేకపోవుచున్నానని ఒక్కొక్కప్పు డామె యాశ్చర్యపడును. దినదినము నూతన పాఠముల కెదురుచూచును. ఆతని కంఠగతమధురస్వర ప్రవాహములో నామె తేలిపోవును.

సూర్యకాంతమునకు శారదకు నాతడు వీలయినప్పుడెల్ల సర్వప్రపంచమునకు సంబంధించిన విషయములను వారి కర్థమగునటుల వారువ్విళ్ళూరుచు వినునంత తీపిగ బోధించుచుండెను.

ఫిబ్రవరి నెలాఖరునకు వారికి బాఠములన్నియు హృదయగతములైనవి. పరీక్షలో ప్రశ్నలకు జవాబువ్రాయు నేర్పంతయు నుపన్యసించినాడు. వారిచేత వందలకొలది జవాబులు వ్రాయించినాడు.

ఒక నాడతడు శారదకు బాఠము చెప్పుచుండెను. సూర్యకాంతము తన పాఠము లవగతము చేసికొనుట కింకొక గదిలోనికి బోయెను. నారాయణరావు కాంభోజి రాగయుక్తమగు తన గొంతుకతో ఇంగ్లీషులో నిట్లు వచించినాడు. ‘షేక్సుపియరుకవి దేహమనఃప్రాణప్రపంచముల మహానాటకములు రచించినాడు. ఉత్తమదశోన్ముఖులుకానివారి జీవితముల నీ ప్రపంచసంబంధములగు గుణములు విషాదమున ముంచి వేయును__అను ఉత్కృష్ట విషయమునే యాతడు వెల్లడించినాడు. గుణములు నీచములు, ఉన్నతములు అని రెండురకములు. నీచ గుణములు గల వాడు నశించును__అనే సర్వసాధారణ నీతి నవి మనకు దోపింప జేయును. పురుషకారహీనమగు మంచితనము మనల నడంచి వేయును__అను విషయమే అతడు మహావిషాదాంతమగు హామ్లెటు నాటకములో చూపించి