పుట:Narayana Rao Novel.djvu/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతి - పురుషుడు

303

రామచంద్రరావు రెండు సంవత్సరముల పరీక్షలో మొదటివాడుగా గృతార్థుడైనాడు.

లియొనారా కన్యకును నది తుది సంవత్సరపు బరీక్ష.

లాతిదేశములలో ఏకదేశస్థులు కలిసికొన్నప్పు డాత్మీయ సహోదరుల జూచినట్లు ప్రేమ జనించును. ప్రాణము లేచివచ్చును. ఆంధ్రు లే బెంగాలు దేశముననో కలిసికొన్నచో, నంతకుమున్ను వారిరువురకు పరిచయము లేకపోయి నను సరియే వారిలో నొకరిది బళ్ళారి, రెండవవారిది బరంపురము నైనను సరియే, ఒక్కచోట పుట్టి పెరిగినవారికన్న నెక్కువ స్నేహముగ మెలగుదురు. అటులనే హిందూ దేశస్థు లిరువు రే యాస్ట్రేలియా ఖండములోనో, జర్మనీలోనో కలిసిననాడు స్నేహితులై సంచరించెదరు.

రామచంద్రరావు మొదలగు హైందవ విద్యార్థు లనేకులు హార్వర్డు విద్యాలయమున, బెర్‌కిలే, న్యూయార్కు, కాలిఫోర్నియా మొదలగు విద్యాలయముల జదువుచున్నారు. వర్తకము చేసికొను గుజరాతీ దేశస్థు లున్నారు. రాజకీయ వ్యవహారములకై యున్నవా రున్నారు. వీరిలో నెవరెవరు కలిసి కొన్నను బ్రాణము లర్పింతురు.

రామచంద్రరా వట్లె పెక్కుమంది విద్యార్థులతో స్నేహ మొనర్చెను. రాజకీయ వ్యవహారములు చూచుకొనువారిలో కొందరు అమెరికా హిందూదేశముల కొండొంటికి గాఢమైత్రి నొనగూర్చ ప్రయత్నించువారున్నారు. అందు కొందఱిభావము లెట్టివో యేరికిని తెలియదు. అట్టివారిలో గండార్ సింగు, ప్రాణకాంతబోసు అను నిరువురు విద్యార్థు లున్నారు.

వారిరువురు చదువులు పూర్తి జేసికొనిన వెనుక కొన్ని నెలలాగి ఫిబ్రవరి నెలలో హిందూదేశమునకు వచ్చినారు. వారువచ్చిన కొద్దిరోజుల కా యువకులపై ప్రభుత్వము వారభియోగమును జరిపినారు. వారికి చెరియొక మూడేళ్లు ఖైదును న్యాయాధికారి విధించెను.

మార్చినెల మొదటివారములో నారాయణరావునకు రామచంద్రరావు వ్రాసిన యొక కమ్మ అందినది.

హార్వర్డు విశ్వవిద్యాలయం,

ఫిబ్రవరి, 1929.

ప్రియమైన బావా,

నీవు వ్రాసిన ఉత్తరం అందింది. నీది యెంత చక్కని హృదయమోయి! ఈ మూడేళ్లు నాకు సరియైన ధైర్యం కొలిపింది నువ్వేసుమా! వారం వారం నీ ఉత్తరానికి ఎదురుచూడ్డం నాకు రెండవభోజనం అయిపోయింది. నేనే నీకు జవాబులు ఆలస్యం చేసేవాణ్ణి. ఎప్పడు డబ్బు కావాలంటే అప్పుడు పంపించావు. కోటీశ్వరుడగు అమెరికా దేశస్థుని కొమరు డెట్లు సంచరించగలిగినాడో ఆలాగు నేనిక్కడ సంచరించానంటే దానికి కారణం నువ్వు. ఎమ్. ఎస్ సి.