పుట:Narayana Rao Novel.djvu/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

నా రా య ణ రా వు

పర: అందుకనే జ్యోతిషంలో మన దేశానికి రెండువందల సంవత్సరాల నుంచి కుజుడు రాజయ్యాడు. మనదేశం నుండి ఇతరదేశాలకి వెళ్ళితేనేగాని మనవాళ్ళకు పేరురాదు. బంగాళీవాళ్ళు, మహారాష్ట్రులు, పాంచాలురు, ఉత్తర హిందూస్థానంవారు వాళ్ళ దేశాల్లోనే గౌరవం పొందుతున్నారు.

నారా: ఇంకో పెద్దకారణం ఉన్నది. పూర్వం మహారాజుల ఆదరణ ఎక్కువ ఉండేది; ఇప్పుడు లేదు. ఆంధ్రదేశంలో కొన్ని పెద్దజమీందారీలు ఉన్నవి. వారు మరీ పెద్దవారు. వారి పూర్వీకుల పేరు నిలబెట్టక ధనం ఎన్ని విధాలో నశింపుచేయుట ఉద్దేశంగల కొందరు మహానుభావులు ఉన్నారు. వివిధ ఉద్యమాలకు సహాయం చేసే మాన్యులూ ఉన్నారు. తక్కినవారు ‘నన్ను ముట్టుకోకు నామాలకాకి’ అని అంతఃపురాల్లో కూర్చుంటారు. ఆంధ్రా పేపరుమిల్లు విషయంలో ఒక్క మహారాజు పూనుకుంటే ఈపాటికది ఎంత లాభకారి అయిఉండును? దేశానికి ఎంత ఉపకారం! అలాగే బందరు పంచదార ఫ్యాక్టరిన్నీ. ఈ పెద్ద జమీలులేని ప్రదేశం రైతువారిదేశం. అందరూ చిన్నరైతులు. వారు తమకు మించిన బ్రతుకు బ్రతుకుతూ మారువాడీలదగ్గిర, షాహుకార్లదగ్గిర అప్పు తెచ్చుటలోనే దేశోపకారం చేస్తూఉన్నారు.

పర: ఇదుగోనమ్మా సోదరీ! రేపు డిశంబరు 15వ తారీఖున చెన్నపురిలో ఆంధ్ర నవ వాఙ్మయసభ జరుగుతూఉన్నది. అప్పుడు చూద్దుకాని, ఆంధ్రుల ఉత్సాహం, కార్యశూరత్వమున్నూ.

సరళ: ఇంక వారంరోజులే ఉంటా!

రోహిణి: మా మంగపతి ఇంగ్లీషులో కవిత్వం వ్రాస్తాడు. అతడు రావచ్చునా?

పర: తప్పకుండా రావచ్చును.

శ్యామ: ఏమిటీ కవులసభ?

పర: ఇప్పుడు ప్రస్తుతం రెండు ఉద్యమాలు భాషావిషయంలో ఉన్నాయి తెలుగుదేశంలో. ఒకటి గ్రాంథికభాషా, పూర్వసాంప్రదాయ కవిత్వం. రెండు వ్యావహారిక భాషా, నూతనసాంప్రదాయ కవిత్వం. దీన్నే భావకవిత్వం అనికూడా అంటారు.

నట: నా బదులు పరమేశ్వరమూర్తి నిండా బాగుగా వాదించినాడుదా.

పర: ఉండవయ్యా ! అరవవాళ్లపని తర్వాత చెప్తాను. సంతోషించకు. అరవము అని అరుస్తారుదా మీరు. మమ్మల్ని మేము నిందించుకొంటూంటే సంతోషిస్తున్నాడు నటరాజన్ ఇందాకటి నుంచిన్నీ.

రోహిణి: భాషనుగూర్చిన వాదం ఏమిటది?

పర: ఏముందమ్మా? గ్రాంథికవాదం, వ్యావహారికవాదం. ఇప్పుడు దేశంలోఉన్న పరిస్థితులు చెప్తా. పూర్వం నుంచీ వచ్చిన గొప్ప గ్రంథాలన్నీ