పుట:Narayana Rao Novel.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ య భా గ ము

పు న స్సం ధా న ము

నారాయణరావు బి. ఎల్. పరీక్షలో బ్రథముడుగా నెగ్గిన వెనుక హైకోర్టులో నొక సుప్రసిద్ధ న్యాయవాదికడ ఎప్రెంటీసు శుశ్రూష నడపి యా పరీక్షలోను మొదటివాడుగా 1928 సంవత్సరపు వేసవికాలములో కృతార్థుడైనాడు. శారదయు బ్రవేశ పరీక్షలో విజయము గాంచినది. జమీందారుగా రామెను నింటరుపరీక్షకు జదివించుచున్నారు.

ఆ వేసవికాలములో భార్యాభర్తలకు పునస్సంధానమహోత్సవం సంకల్పించి చుట్టముల నందరిని రప్పించినారు. నారాయణరావు స్నేహితులు చుట్టములుగూడ బెండ్లికి వచ్చినట్లే వచ్చినారు.

పునస్సంధానమున కొంతమంది విచ్చేయుట నారాయణున కిష్టము లేకున్నను తండ్రిగారి యిష్టమున కాత డెదురుచెప్పలేక పూర్వాచారము ప్రకారము చుట్టపక్కములతో జమీందారుగారి గృహమునకు దరలి వెళ్ళెను.

ఉదయముననే భార్యాభర్తలు పీటలమీద కూర్చుండవలయును. గ్రామ గ్రామములనుండి బ్రాహ్మణోత్తము లెందరో విచ్చేసిరి. జమీందారుగారి సభా మంటపమంతయు లోచనమోహనముగ నలంకరింపబడినది. చుట్టములు, స్నేహితులు, పండితశ్రేష్ఠులు, పరివారజనము క్రిక్కిరిసియుండిరి.

పూర్ణయౌవనముచే నారాయణరావు దేహము మిసమిసలాడుచుండెను. చిరుమీసములు తుమ్మెద రెక్కలవలె నల్లనై మోమున కొక వింతయందము గూర్చెను. కుమారస్వామివలె, మంజుశ్రీవలె, శ్రీకృష్ణునివలె నున్న యాతని మూర్తి తెల్లగంధపు బొమ్మవలె సభ్యుల కన్నులకు జల్లనై హృదయములు మోహింపజేసినది. సంధ్యావందన మొనర్చి, తడిపి యారవేసిన క్షీరాబ్ధిదుకూలముల ధరించి, యున్నతమూర్తియు గోమూర్ధకటియునగు నా యువకుడు, మత్త గజగమనముతో వత్సరాజువలె నరుదెంచి పీఠముకడ నిలుచుండెను.

శారద సర్వాభరణభూషితురాలై సరిగ బుటేదారియంచుల హోంబట్టు చీర ధరించి, తెల్లని మేల్పట్టు బనారసు (జంపరు) కంచుకము ధరించి, పూలు ముడిచిన వాలుజడతో వచ్చి భర్తప్రక్కనే నిలుచుండినది.

మంగళవాద్యములు బోరుమనినవి. దంపతులను పీటలపై నధివసింప జేసిరి వసిష్ఠులవారు.

‘ఓం కేశవాయస్వాహా ఓం నారాయణాయస్వాహా ఓం మాధవాయ స్వాహా’ అని వసిష్ఠు డాతనిచే నాచమనాదులు చేయించెను.