పుట:Narayana Rao Novel.djvu/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తా త ము చ్చ టు లు

183


‘సరేలే!’

తటవర్తి వారి కుటుంబాలు పెద్దవే. అచ్చటచ్చట దేశమల్లా ఉన్నవి. బాగా ఆస్తులు సంపాదించుకొన్నారు. రాధాకృష్ణయ్యగారికి మంచి ఆస్తి ఉన్నది. కాని యాయన తదనంతరము కుమారులు నలువురు పంచుకొన్నచో, తలకొక యిరవై యకరాలు వచ్చును. పైగా పెళ్ళిళ్ళకు, భూములు కొనుటకు అప్పులు చేసినారు. అవి పెరుగుచున్నవి.’

‘బాబూ! మీ అప్పులన్నీ తీర్చారా?’

‘ఏమి తీర్చడమోరా, మనవాళ్ళ బతుకులు మారువాడీల చేతుల్లో అంతరిస్తా యనుకుంటాను. రామచంద్రపురంవాళ్ళకు ఏడువేలు తణకాలమీద ఇవ్వాలి. ఎవ్వణ్ణి చూసినా అప్పులే. దేశం అంతా అప్పు నానాటికీ పెరిగిపోతోంది. ఎలాగో తీర్చుకోడం. నాలుగురాళ్ళు మిగుల్చుకున్న వాడెవ్వడూ కనబట్టంలేదు.’

‘అవును. దేశంలో పండిన పంటంతా ఏమవుతోందో, మనవాళ్ళు_ ఇదంతా రూపాయికీ కాసుకూ ప్రభుత్వంవారు ఏర్పాటు చేసిన మారకం రేటు వల్లనే అంటారు. అట్లాకాకుండా మారకంరేటు తగ్గించి, వెండి ఖరీదుచేసి, మేలిమి వెండి పట్టుకువెళ్ళినవారికి, చేయుబడి ఖరీదు తీసుకొని, గట్టికి ఇతర లోహం కలిపిన ఖరీదు తీసివేసి, రూపాయ చేస్తే దేశం దౌర్భాగ్యం తగ్గుతుంది అంటారు. జపానులో అల్లా చేస్తారు. కనుకనే వాళ్ళ దేశంలో వస్తువులు వెఱ్ఱిచవుక. అప్పు లేదు, బీదతనం లేదు అని మా నారాయుడు చెప్పాడు.’

‘ఏమి లెక్కలో! మా చిన్నతనంలో మేము జొన్నన్నం తిన్నాం, వరీ తిన్నాం; వస్తువులు వెఱ్ఱిచవుక. మనవాళ్ళందరికీ, మెరకాపల్లం అంతా కలిసి రెండువందల యకరం ఉంటే, స్వంతంగా వ్యవసాయం. కాయగూరలు పండేవిరా! మా నాయన జొన్నమోపు పొలాన్నుంచి మోసుకువచ్చేవాడు. మళ్ళీ దేశపాండేలంకూడా. లోకం అంతా గజగజలాడేది. కుంఫినీరాజ్యం రాని క్రితంసంగతి యెరుగుదునని మా తాతయ్య రామయ్యగారు నాకు చెప్పేవారు, మీ నాన్నా యెరుగును. మీ తాత ఈ ఊరు దౌహిత్రం వచ్చాడు. ఇల్లరికం కూడాను. ఆ రోజుల్లో మా తాతయ్య తండ్రి పల్లకీమీద వెడుతోంటే వీధుల్లో జనం కూచునిఉండేందుకువల్లా! మీ తాతయ్య తాత మా తాతయ్య తండ్రి. తెలుసునా? ఆయన నవాబుదగ్గిరకు పల్లకీమీదేరా వెళ్ళడం సుబ్బారాయుడూ!’

నారా: ఏం తాతయ్యా, మీ తాతయ్యా వాళ్ళూ బాగా వడ్డూపొడుగూ మనుష్యులేనా!

రాధా: ఒరే నారాయుడూ! నన్ను చూశావా, నా పొడుగుముందర మా తాతయ్య గోపురం అనుకోవాలి. వాళ్ళ శక్తి, సామర్థ్యం మాదగ్గిర ఎక్కడుందిరా?

నారా: మీదగ్గరున్నది మాదగ్గిర లేదు తాతయ్యా!