పుట:Narayana Rao Novel.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ మీం దా రు డు

15


సంఘసంస్కరణాభిలాషి యగు జమీందారుగారు శారదకు ఉన్నత విద్యలు చెప్పించవలెనని యెంత కుతూహలపడినను ఆయనహృదయము మాత్రము పూర్వసంప్రదాయ ఘంటాపథము దాటలేకపోయినది. వయసు మీరిపోకుండ శారదకు వరుని తేవలయు. ఇదివరకు జమీందారీ కుటుంబములతో వియ్యమందినాడు. ఆ సరదా తీరినది. తల బొప్పెలు కట్టినది. ఈనా అనుంగుకూతురిని ‘జమీందారు రాతుచేతనిడనమ్మ త్రిశుద్ధిగ నమ్ము శారదా!’ అని హృదయమున శపథము చేసికొన్నాడు.

భార్యయైన వరదకామేశ్వరీదేవి తన అన్న గారికొమరుడగు శ్రీ క్రొవ్విడి బసవరాజేశ్వర జగన్మోహనరావునకు శారద నిచ్చి యుద్వాహ మొనరింప పట్టుపట్టినది. అన్న గారగు విశ్వేశ్వర ఆనంద సువర్ణేశ్వరలింగం గారు విజయనగర వేశ్యవాటి సముద్రజనిత మాయాప్సరోమణీ నీచశృంగార సమారాధనలో ప్రాణముగూడ ధారపోసి, ఆస్తి అప్పులపాలుచేసి పోయినాడు, ‘కోర్ట్ ఆఫ్ వార్డ్సు’ వారు వ్యవహరించి అప్పులు నిశ్శేషముగా దేర్చివేసి, రెండు లక్షల రూపాయల నిలువతో నిరువది రెండేండ్ల వయసున జగన్మోహరావుకు జమీ అప్పగించినారు. ఈ చిన్న జమీందారుని గూర్చి రహస్యములు కథలై దేశ మంతట ప్రాకుచున్నవి.

లక్ష్మీసుందరప్రసాదరావుగా రా సంబంధముమాట భార్య కదిపినప్పుడు జుగుప్సపడినాడు. “అమ్మాయిని నరకకూపంలోకి వేరే తోయనక్కరలేదు! మన హృదయాలు పాషాణాలు చేసుకోవాలి మీ మేనల్లుడి కివ్వాలంటే” అన్నారు.

శీఘ్రముగా వివాహముచేయ సంకల్పించి వరునికై ఆంధ్రదేశము వలలు వేసి వెదకించినారు. అభిజాత్యముగలవాడు, అన్నవస్త్రములకు లోపములేని వాడు, మంచి తెలివైనవాడు, రూపవంతుడు, గుణవంతుడు, చదువుకొన్నవాడు గావలె నల్లుడు. సుప్రసిద్ధ నియోగికుటుంబము లన్నియు వెదకించినారు. వాడ్రేవువారు, మంచిరాజువారు, మారెళ్లవారు, చెన్నాప్రగడవారు__ వేయేల గోత్రములు ఋషులు కలియని ఇంటిపేర్లవారి జాబితా గవర్నమెంటువారి ‘నీలపుకాగితము’ వంటిది తయారైనది.

తారాచువ్వవలె పైకెగయు బాలురకు ధనముండదు. ధనమున్న వారు విద్యాగర్భదరిద్రతలో మునిగియున్నారు. రెండునుగల బాలకులకు రూప సంపద ఎరువుతీసికొని రావలయును. కొంచెముకొంచెముగా నీ మూడును ఏకీభవించిన నరులు విషకుంభసమానులు. జమీందారుగారికి విసుగు జనించి శారదకు తగిన భర్త దొరకునా యనిపించినది. తన భావవీధిలో నడయాడు జామాత కేమాత్రము తీసిపోయినను అట్టివానికి చూచిచూచి తన ముద్దులపట్టి నొసగుట కాయనకు మనసొప్పినదికాదు.