పుట:Narayana Rao Novel.djvu/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

నారాయణరావు


ప్రేమింపగలరు. నారాయణరావు ప్రేమ యాతని బ్రతుకును మూలమంట గదల్చి యాజన్మాంతము దివ్యజ్యోతివలె వెలుగుచుండవలసినదే. పరమేశ్వరుడు స్నేహితు డొకసారి తన్ను మరచినచో తానును మరచిపోగలడు.

నారాయణరావు స్నేహము తనకు లభించినందులకు బరమేశ్వరుడు సంతతము భగవంతునికి కృతజ్ఞత తెల్పుచుండును; ఆనందము నొందును. కన్నులరమోసి తన్మయుడగును. నారాయణుడు నిజమా కాదా యన్న ప్రేమచే నాతని యొడలంటును, ఆతని యొడిలో దలనుంచి యంతర్దృష్టి వహించును. ‘మీకు నారాయణరావు అన్నగారు భర్తగారా, భార్యగారా?’ యని రుక్మిణి పతిని మేలమాడును.


౬(6)

కవిత్వము

పరమేశ్వరునకు భారతి పత్రికలో నేబది రూపాయల జీతమును గరుణార్దృహృదయుడగు నాగేశ్వరరాయ డేర్పరచెను. తన భార్యను దీసికొని వచ్చి, పరమేశ్వరమూర్తి మాంబళంలో గాపురము పెట్టెను. మంచి నెయ్యి రాజమహేంద్రవరము నుండి వచ్చినదని, తనతండ్రిగారు కొత్తపేట నుండి కమ్మని పప్పునూనెయు, గొబ్బరినూనెయు బంపించినారని, నారాయణరావు పరమేశ్వరున కెన్నియో వస్తువులందించుచుండును. రుక్మిణమ్మకు పట్టణము చూపించమని, సినిమాకని నారాయణరావు తన మోటారును పరమేశ్వరునికి నాతని సెలవుదినములలో బంపుచుండును. పరమేశ్వరుని మంచిగృహము నద్దెకు తీసుకొనుమని బ్రేరేపించి నారాయణు డా గృహమున వారికి వలయు మంచములు పీఠములు వంట సామానులు మొదలగునవి కొనియిచ్చినాడు.

రాజారావు తనకున్న కొద్ది తీరుబడికాలములో నారాయణరావుతోడనో, పరమేశ్వరునింటనో, పరమేశ్వరునితో నారాయణరావింటిలోనో, స్నేహితులతో నానందము ననుభవించువాడు. ఏ స్నేహితుడు కావలయునన్నను నారాయణరావు తన మోటారులో బోయి యాతని గొనివచ్చువాడు. ఆలం నారాయణరావును కలిసికొనని దినమే లేదు. రాజారావు, ఆలం, పరమేశ్వరమూర్తి, నారాయణరావులు ఒకరి కొకరు గాఢమిత్రులైనారు.

పరమేశ్వరుడు ఆనాటి యువకవులు రచించిన పాటలు, పద్యములు కలకంఠముతో మధురముగ బాడుచుండెను. అత డెన్ని సభలలోనో పాటలు పాడువాడు. తాను పాటలను పద్యములను రచించును. చిన్న కథలను వ్రాయుచుండును. తనరచనముల ‘భారతి’ లో బ్రకటించుచుండును.

ఒకనాడు పాట నొకదాని రచియించి పరమేశ్వరుడు నారాయణరావు కడకు గొనివచ్చెను.