జపాన్ నుంచి ఢిల్లీ వచ్చిన ఆ దేశపు టి.వి. బృందం ఈ వార్తను ఢిల్లీ ఇంగ్లీషు పత్రికలలో చూశారు. నెహ్రు - గాంధి కుటుంబంతో నాకు గల సన్నిహిత సంబంధాల పై ఒక వార్తా చిత్రాన్ని నిర్మించదలచామని, అందుకు "ఢిల్లీకి రాగలరా?" అంటూ జపాన్ టి.వి. వారు నాకు ఫోన్ చేశారు. అది 1991 మే నెలాఖరు. మండుటెండలు, ఢిల్లీలో మరీ తీవ్రమైన ఎండలుంటాయి. నాకు అప్పటిలో వంట్లో బాగా లేదు కూడా. వారికి అదేమాట చెప్పాను. వారు కూడా "సారీ" అని ఫోన్ పెట్టేశారు. నేను కూడా ఆ విషయం మరచిపోయాను.
కాని, వారు నా వద్ద ఉన్న నూరు లేఖల మాట మరచిపోలేదు ! 1991 మే 31వ తేదీన నాకు ఢిల్లీ నుండి తిరిగి ఫోన్ ! తామే జూన్ 2వ తేదీన విజయవాడలోని మా గృహానికి వచ్చి, అక్కడే నాతో ఇంటర్వ్యూ జరుపుతామని పేర్కొన్నారు. నేను "సరే" అన్నాను.
అన్న మాట ప్రకారం 1991 జూన్ 2వ తేదీ మిట్ట మధ్యాహ్నం జపాన్ టి.వి. బృందం రెండు కెమెరాలతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానంలో వచ్చి, అక్కడి నుంచి రెండు కార్లలో విజయవాడలో మా ఇంటికి వచ్చారు. మా వీథి, గృహం, నా అలమారాలో నెహ్రు, ఇందిర, రాజీవ్ల ఉత్తరాలున్న ఫైలు - ఇవన్నీ తమ కెమెరాలతో చిత్రించారు. తరువాత నన్ను ఆ టి.వి. బృందం ఇంటర్వ్యూ చేశారు.
"రాజీవ్ గాంధి గతించారు కాదా! భారత దేశం భవిష్యత్ ఎమిటి? ఇక నాయకు డెవరు?" అని ప్రశ్న.
"ప్రజాస్వామ్యంలో నాయకుణ్ణి ప్రజలే సృష్టించుకుంటారు. నెహ్రు తరువాత లాల్ బహదూర్, ఆయన వెనువెంటనే ఇందిరా గాంధి, ఆమె తరువాత రాజీవ్ గాంధి - వీరిని ఎవరు సృష్టించారు? ఇప్పుడు కూడా త్వరలోనే కొత్త