పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

సాతవాహనులు

సాతవాహను లంధ్రులు గా రని వాదించువారు గొందఱు గలరు. సాతవాహన రాజులలోఁ బ్రఖ్యాతి గన్నవారు, కుంతల దేశమందలి ప్రతిష్ఠాన పట్టణము రాజధానిగాఁ గుంతల సౌరాష్ట్ర మహారాష్ట్రాది దేశములనే పాలించినట్లు శాసనములందు గానవచ్చుటయు నంధ్రదేశమును పాలించినట్లు గానరాకుండుటయు వారి వాదమునకుఁ బ్రబలసాధనము. పురాణములందు వా రంధ్రులుగాఁ బేర్కొనఁబడిరి. ఇది పై వాదమునకుఁ బ్రబల బాధకమే యయినను వారు దీనిని బుక్కిటి పురాణపు మాటగాఁ ద్రోసివేయఁజూతురు. ప్రాచీన సాతవాహను లంధ్రదేశమును బరిపాలించి రనుట కాధారములు లేవా? విచారింతము.

నాసిక, కార్లి మొదలగు చోట్ల గుహలలోఁగల సాతవాహన శాసనములలో వాసిష్ఠీ పుత్రపులుమావిశాసనములు ముఖ్యమయినవి. వానిని బట్టియే పయి వాదమును, పి.టి.శ్రీనివాయ్యంగారు, సూక్తంకరుఁడు, సుబ్రహ్మణ్యయ్యరు ప్రభృతులు, నెలకొల్పిరి[1]. అందు వారి వాదమున కాధారమయిన పట్టిది. -"రాజరాజ్ఞో గోతమీ పుతస, హిమవత మేరు మందర పవత సమసారస, అసిక, అసక, ముళక, సురర, కుకురా పరంత అనుపవిదభ అకరావతి రాజస, విఝ, చవత, పారిచాత, సహ్య, కణ్హగిరి, మచ, సిరిటన, మలయ మహింద, సెటగిరి, చకోరపవత పతిస," దీని సంస్కృతచ్చాయ. - రాజరాజస్య గౌతమీపుత్రస్య హిమవన్మేరు మందరపర్వతసమసారస్య, అసిక, అశ్వక, ముళక, సురాష్ట్ర, కుకురాపరాం

  1. 1. మ, సోమశేఖర శర్మగారి 'ఆంధ్ర మహాసామ్రాజ్యము' అను వ్యాసము. భారతి సంచికలఁ జూడుcడు. పైవారి వాదములస్వరూప మెల్ల నందు వారు పరామర్శించిరి.