పుట:MaharshulaCharitraluVol6.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

శుక్రమహర్షి

(ఉశనసుఁడు)

జననము

భృగుమహర్షి నవబ్రహ్మలలో నొకఁడై మహో త్తమ వంశమూల పురుషుఁడై ప్రఖ్యాతినందెను. ఆతఁడు కర్దమప్రజాపతి కూఁతు రగు ఖ్యాతి యనునామెను బెండ్లాడి ధాత, విధాత యను నిరువురుకుమారులను శ్రీ యనుకూఁతును గనెను. ఆతఁడు పులోమ యనునామెను బెండ్లాడి చ్యవనమహర్షిని గాంచెను. ఉశన యను నామెను బెండ్లాడి యామె కొక కుమారుని జ్రసాదించెను. ఇతఁడే ఉశనసుఁడు. ఈతనికి శుక్రుఁ డనుపేరు తరువాత కలిగెను.

ఉశనసుఁడు బాల్యమునుండియు సర్వవిద్యలును సంపాదించి మహాతపస్సు చేసి “మృతసంజీవని" (చచ్చినవారిని బ్రదికించునది) అను గొప్పవిద్యను సంపాదించెను. ఈ లోకోత్తరశక్తి వలన ఉశనసుఁడు మహావిఖ్యాతి నార్జించెను.

శుక్రుఁ డను పేరు వచ్చినవిధము

ఉశనసుఁడు తపోబలముచేతను యోగబలముచేతను సర్వశక్తులు సంపాదించి విఱ్ఱవీఁగుచుండెను. ఒకప్పు డాతఁడు ధనార్థియై కుబేరుని కడ కేగి యాతని నవలీలగా మోసపుచ్చి యాతనిధననిక్షేపముల నపహరించెను. కుబేరుఁడు చేయునది లేక యీశ్వరునికడ కేగి యాతనితో మొఱపెట్టుకొనెను. తనభ క్తునకు ద్రోహము చేసిన భార్గవవంశజుఁ డగు ఉశనసునిపైఁ గోపించి యీశ్వరుఁడు శూలమెత్తి యా దుర్మార్గుఁ డెచట నున్నాఁ డని ప్రళయగర్జ చేసెను. అది విని ఉశనసుఁడు గడగడలాడిపోయి పోయిపోయి మాఱుమూలల సందుగొందుల తుప్పలలో దూఱి