మహర్షుల చరిత్రలు
ఆరణ్యక మహర్షి
శ్రీ రామనామోపాసకు లయి పరమేశ్వరసాయుజ్యము నందిన మహనీయులలో ఆరణ్యకమహర్షి యొకఁడు. అరణ్యమునబుట్టు యరణ్యమున బెరిగి యరణ్యమున మహాతప మొనరించి యరణ్యము తక్క నొం డెఱుగని ఈ మహనీయునికి అరణ్యకుడను పేరు వచ్చెను. ఈతని జననీజనకులయు మాతామహ పితామహులయు చరిత్ర మేమియు దెలియరాదు.
ఆరణ్యక మహర్షి రేవానదీ తీరమున నొక యాశ్రమమును నిర్మించు కొని యందు దప మొనరించు చుండెను. అతని యాశ్రమము పరమ పవిత్రమై యొప్పారు చుండెను. అశ్రమమునకు దశదిశలను ఆమడ మేర మహా ప్రశాంత వాతావరణము వెల్లి విరియు చుండెను. ఆ మహర్షి తపః ప్రభావమున మహాక్రూర జంతువులు సైతమా యామడ మేర పరమ శాంతితో బ్రవర్తించును. రామనామోపాసకుడగు నా మహర్షి ధ్యానానంతరము చేయు రామ స్మరణముతో ప్రకృతి యంతను శ్రుతిగలుపును. పండుటాకులు రాలినను, ఎండు కట్టెలు విఱిగినను, చీమ చిటుక్కు మన్నను రామ శబ్దముగనే యా మయరణ్యమున ధ్వనించును; ప్రతి ధ్వనించును; రామ మంత్రము, రామ ధ్యానము, రామ స్మరణము, రామ పూజనము, రామ చింతనము, రామ మననము - వీనితో కూడిన యారణ్యకమహర్షి యాశ్రమము శ్రీ రామ మయముగ జెలగు చుండెను.
ఇట్లుండ శ్రీరాము డశ్వమేధయాగ మొనరించి యశ్వమును విడిచిన పిదప దానివెంట శత్రుఘ్నుడు పరివార సహితుడై యుత్తర ప్రాంతారణ్యములకు విచ్చేసెను. అతని దిగ్విజయయాత్రలో యజ్ఞా