పుట:MaharshulaCharitraluVol6.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధౌమ్యమహర్షి

41


యన్ని విధముల నుత్తమ బ్రాహ్మణుఁ డనియు నాతనిని బురోహితునిగా వరించినఁ బాండవులకు సర్వశుభములు సమకూరుననియు సూచించెను. పొండవు లాతఁడు చెప్పిన చొప్పున ‘ఉత్కచ' తీర్థమున కరిగి జగత్పూత చరిత్రుడు, సాధుజన పూజితుడు, ధార్మికుఁడు, మహాత్ముఁడు. హితమితభాషణుఁడు, బ్రాహ్మణకుల భూషణుఁడు నగు ధౌమ్యమహర్షిని బొడగాంచి యాతనికి నమస్కారము లొనరించి తమవచ్చినపనిఁ దెలిపి తమకుఁ బౌరోహిత్య మంగీకరింపు మని ప్రార్థించిరి. ధౌమ్యుఁడు వారి నతిపిరితి నాదరించి వారికిఁ బురోహితుఁడుగా నుండ నంగీకరించెను. ఇట్లు తేజోవచోరూప బుద్ధివిభవములచే బృహస్పతి సమానుఁడై , వేద వేదాంగవేది, ఋషిసత్తముఁడు నగు ధౌమ్యుని పాండవులు పురోహితుం గావించుకొనిరి.

పాంచాలీపరిణయము

పిదప, పాంచాలాధిపతి వీటికి వ్యాసప్రేరితులు, బ్రాహ్మణజన చోదితులునై పాండవు లేగిరి. అట జరగు ద్రౌపదీస్వయంవరమునకు వా రేగిరి. అందు రాజన్యుఁ డెవనికిని సాధ్యముకాని మత్స్యయంత్రము నర్జునుఁ డేసి ద్రౌపదిని గడించెను. కుంతి యానతిని, వ్యాసభగవానుని యనుమతిని పాంచాలిని బంచపాండవులకు నిచ్చి పరిణయము గావింప ద్రుపదుఁ డంగీకరించెను.

శుభలగ్నమున వివాహ మొనరింప ధౌమ్యుఁడు పౌరోహిత్యము వహించెను. పాండవులు మంగళ స్నానములు చేసి, వివాహోచిత వేషములు ధరించి, రత్నభూషణములఁ దాల్బి విచ్చేసిరి. ద్రౌపది పూర్ణేందువదనయై విదగ్ధ పుణ్యాంగన లలంకరింవ లలితప్రసాధనాలంకృతాంగియై కమలాక్షి కమనీయ కాంతాసహస్రముతో నరుదెంచెను. అపుడు మహావిప్రుల పుణ్యాహరవము, మంగళగీత వాద్య మధురరవము పణవవేణు వీణారవము దిశలు మార్మోగునట్లు మ్రోయ వివాహమంగళ మారంభమాయెను. ధౌమ్యమహర్షి వివాహప్రయుక్తము లగుమంత్రా హుతులను బుధసమ్మతముగా నగ్నిహోత్రమున వేల్బేను. పెద్దల యనుమతిని ధౌమ్యుఁడు తొలుత ద్రౌపదిని ధర్మజునకుఁ బాణిగ్రహణము