పుట:MaharshulaCharitraluVol6.djvu/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదంకమహర్షి

21


ఉదంకునకు మహాశివుఁడు ప్రత్యక్షమగుట

తరువాత ఉదంకుఁ డొకమరుభూమిని జేరి యందనేక సంవత్సరములు మహాశివుని గుఱించి మహాతప మొనరించెను. చిరకాలమునకు దయకలిగి శివుఁ డుదంకునకుఁ బ్రత్యక్షమయ్యెను. ఉదంకుఁ డా మహా దేవునకుఁ బ్రదక్షిణసాష్టాంగనమస్కారము లొనరించి యిట్లని స్తుతించెను:

"దేవదేవ! శ్రుతి ప్రమాణవిధేయ! మాధవ! జంగమ
స్థావరాత్మక మైనలోకము సర్వమున్ భవదీయ మా
యావిధేయము విశ్వరూపుఁడ వవ్యయుండవు నీవ స
ద్భావసుస్థితి ని న్నెఱింగినఁ బాయుఁ బాపము లచ్యుతా!

అనిమిషసిద్ధసంయమివిహంగభుజంగమముఖ్యు లెల్ల ని
న్ననిశముఁ గొల్పి నీదయఁ గృతార్థతఁ బొందుదు రెందు నీవు నె
మ్మనమున సంతసిల్లుడు సమ స్తజగంబులు శాంతిఁ బొందు నీ
కినుకకు మాఱు లేదు శివకిరన! యీ భువనత్రయంబునన్.

విక్రమత్రయలీల నోలిన విష్టపత్రితయంబుఁ బె
ల్లాక్రరమించితి క్రూరు లై నసురారివీరులఁ బ్రస్ఫుర
చ్చక్రవిక్రమ కేళిఁ ద్రుంచితి సర్వయజ్ఞఫలావహ
ప్రక్రియాత్ముఁడ వీవు నిశ్చలభావభవ్య జనార్దనా! "
                        భార. ఆర. 4. 376, 377, 378.

అని పరిపరివిధములఁ జేసిన యుదంకుని ప్రస్తుతి కలరి మహేశుఁడు “ వత్సా! నీ కేమి కావలయునో కోరుకొను మనుగ్రహించెద" నని దయామయుఁడై వీనులవిందుగాఁ బలికెను. "దేవాదిదేవా! నీ దివ్య రూపము నిట్లు ప్రత్యక్షముగాఁ గనఁగల్గితిని. ఇంతకంటె నాకుఁ గావలసిన వరమే లేదు. ఐనను నా మనస్సు సత్యధర్మశమములయందు.. స్థిరముగా నుండునట్లు నాకు నీపై భక్తి స్థిరముగ నిలుచునట్లు ననుగ్రహింపు" మని యుదంకుఁడు ప్రార్థించెను. శివుఁ డట్లే యని యాతని కోరినవర మనుగ్రహించి లోకహితార్థము సత్కృతు లొనరింపు మని దీవించి యంతర్హితుఁడయ్యెను.