పుట:MaharshulaCharitraluVol6.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదంకమహర్షి

19


పురుషుఁడు తన గుఱ్ఱమునిచ్చి దానిపై సెక్కి మఱుక్షణములో గౌతమునింట దిగఁగల వని చెప్పెను. ఉదంకుఁ డమితానంద మంది కృతజ్ఞుఁడై గుఱ్ఱమునెక్కి తలఁచిన యా క్షణముననే గౌతము నింటికి వచ్చి చేరెను.

అట గురుపత్ని యగు నహల్యయు శుచిస్నాతయై నూతన వస్త్రముల ధరించి కుండలములు ధరించు సమఁయ మగుట నెదురుచూచు చుండెను. ఉదంకుఁడువచ్చి కుండలము లామె కర్పింపఁగనే యామె వానిని ధరించి పతికి నమస్కరించి బ్రాహ్మణులఁ బూజించి తాను దలపెట్టిన వ్రతము పూర్తికావించెను.

గౌతముఁ డుదంకునిఁ గౌఁగిలించుకొని “వత్సా!

నీ చరితంబు చిత్రమహనీయము మిత్త్రసహక్షితీశ్వరున్
నీచతఁ బాప నాగ మపనితము సేసినకుండలద్వయం
బా చతురత్వ మా బలిమి యా దృఢనిశ్చయ మట్టులొప్ప ధ
ర్మోచితలీలఁ దేర నొరుఁ డోపునె యేను నిజంబ పల్కితిన్. ”

అని ప్రస్తుతించెను. ఉదంకుఁడు గురుపాదములకు మ్రొక్కి తాను గౌతమాశ్రమమునుండి బయలుదేఱి వెడలినది మొదలు కుండలములు తెచ్చునందాఁక జరగిన యావద్విషయమును బూసగ్రుచ్చినట్లు గురువులకు నివేదించి " దేవా ! ఆ దివ్యపురుషుఁ డెవఁడు? ఎద్దేమిటి ? గోమయ మేమి? తెలుపు నలుపు నూలునేయు స్త్రీలెవ్వరు? ఆ యారుగురు కుమారు లెవ్వరు? నాకు సాయువడిన యా దివ్యుఁ డెవ్వఁడు? ఇవి యన్ని యు దివ్యజ్ఞానసంపన్నుల రగు తామే నాటఁ దేటతెల్లముగాఁ దెలుపుఁ” డని ప్రార్థించెను.

గౌతమమహర్షి యుదంకుని కిట్లు తెలిపెను. "వత్సా! ఆ దివ్య పురుషుఁ డింద్రుఁడు. ఆ యెద్దు ఐరావతము, గోమయ మమృతము. నాగలోకములోఁ గాననైన స్త్రీ లిద్దఱు ధాత, విధాత. వారు నేయు వస్త్రము అహోరాత్రము. ద్వాదశారములు గలచక్రము పండ్రెండు మాసములతోఁ గూడిన సంవత్సరము. ఆఱుగురు కుమారులు ఆఱు