పుట:MaharshulaCharitraluVol6.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

మహర్షుల చరిత్రలు

గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతిఖేలన నొప్పి సహాశ్వసేనుఁడై
ధాత్రిఁ బరిభ్రమించుబలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁబ్రసనుఁడయ్యెడున్.”
                    భార. ఆది. 1, 105, 106, 107, 108

పిదప, ఉదంకుఁ డందు తెలుపు నలుపు దారములతో వస్త్రమును నేయునిద్దఱు స్త్రీలను, ద్వాదశారచక్రముఁ ద్రిప్పుచున్న కుమారు లార్వు రను, పెద్దగుఱ్ఱము నెక్కి మహాతేజస్వి యైన యొక దివ్య పురుషునిం జూచి యర్థవంతములైన వేదస్తుతులతొ వారి నెల్లరిని సంతోష పెట్టెను. ఆ దివ్యపురుషుఁడు ఉదంకునిజూచి "వత్సా ! నీ కేమి కావలయునో కోరుకొ" మ్మనెను. దాని కాతఁడు "దేవా! ఈ నాగు లందఱు నాకు వశులు గావలయు” నని కోరెను. “అగుచో నీవు వచ్చి నా గుఱ్ఱము చెవిలో నూఁదు" మని ప్రేరేచెను. ఉదంకుఁ డట్లొనరింపఁగనే ఆ గుఱ్ఱము ప్రతిరోమకూపమునుండి యనేకములగుమంటలు బయలుదేఱి పాతాళలోక మంతయు భయంకరముగా వ్యాపించెను. నాగకుల మంతయు మిక్కిలి భయపడెను. ప్రళయకాలవహ్నివలె వ్యాపించిన యగ్ని హోత్రములఁజూడ పాఁపరాజు గడగడలాడిపోయెను. ఇది యంతయు ఉదంకుని భయంకరకోపాగ్ని యని తలపోసి యాతనిని శరణువేఁడుటకన్న గత్యంతరము లేదని కుండలములు తీసికొనివచ్చి యాతని కర్పించి తక్షకుఁడు తన్నుఁ గాపాడు మని శరణుజొచ్చెను.

ఈ విధముగాఁ గుండలములు తిరిగి గ్రహించియు ఉదంకుఁ డిట్లు తలపోసెను. “నేఁటినుండి నాల్గవదినమునకుఁ గుండలములు తీసికొనిరమ్ము. నేను వ్రతముఁ బూ ర్తిచేసికొని సిద్ధముగా నుందు" నని గురుపత్ని పంపినది. అయ్యో! నేఁడే నాల్గవదినము. నే నెట్లీ పాతాళము నుండి బయటపడఁగలను ? ఎట్లు గౌతమాశ్రమము చేరఁ గలను ? అంతయు నగమ్యగోచరముగా నున్నదే ! నేఁడుపోయి కుండలము అహల్యాసాధ్వి కీయనినాఁడు నాశ్రమ మంతయు వ్యర్థమే యగునే? ” అని చింతించు మదంకుని యభిప్రాయ మెఱిఁగి యా దివ్య