పుట:MaharshulaCharitraluVol6.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

మహర్షుల చరిత్రలు


వగుదు" వని శపించెను. "అల్పదోషమున నీవు నన్ను శపించితివి. నీ వనపత్యుఁడ వగుదు” వని రాజాతనికిఁ బ్రతిశాపమిచ్చెను. వెంటనే యుదంకుఁడు “రాజా ! నా శాప ముపసంహరించెదను. నే ననపత్యుండనుగా నోపను. నీ శాపము నుపసంహరింపు" మని కోరెను. అందుపై రాజు "ఋషీశ్వరా !

నిండు మనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత ! విప్రులయందు నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్.
                                     (భార, ఆది . 1, 10, 1)

కావున శాపముఁ ద్రిప్పఁగలశక్తి లేని నన్ను మన్నించి శక్తి యుతుఁడవు గావున నీ శాపమునుండి నన్ను రక్షింపు" మని ప్రార్థించెను. ఉదంకుఁ డందుల కియ్యకొని రాజునకు శాపమోక్షము ననుగ్రహించి వెడలిపోయెను.

ఉదంకుఁడు కుండలములు కృష్ణాజినమున జాగ్రత్తగా దాఁచి గౌతమాశ్రమ మార్గమున వేగముగాఁ బోవుచుండెను దారిలోఁ బరిపక్వ ఫలములతోఁ గూడిన బిల్వవృక్ష మొకటి కానిపింప నాఁకలిబాధ పోఁగొట్టుకొనఁ దలంచి ఉదంకుఁ డా వృక్షమునెక్కి కృష్ణాజినము నొక కొమ్మకుఁ దగిలించి ఫలములు గోసికొనుచుండెను. ఇంతలో నొక పెద్ద గాలి వీవ, కృష్ణాజినము పట్టుదప్పి నేలపైఁ బడెను. వెంటనే తక్షకుఁడను పాములరాజు కుండలము లపహరించి నాగలోకమునకు భూ వివరమార్గమునఁ బోయెను. ఉదంకుఁ డది చూచి యొక్క పెట్టున భూమి కుఱికి ఆ పామును బట్టఁబోయి యొకపుట్టఁ ద్రవ్వ మొదలిడెను. ఆ మహనీయుఁ డట్లు తన్నుఁ ద్రవ్వుట భరింపఁ జాలక భూదేవి భయపడెను. బ్రాహ్మణరూపమున నింద్రుఁ డచటికివచ్చి " అయ్యా! కొయ్యకోలతోఁ ద్రవ్వినచోఁ బాతాళమునకు మార్గ మేర్పడునా? ఎవ్వరైన నవ్విపోదురు. పాతాళలోక మిక్కడకు వేయియోజనముల లోఁతున నున్నది. నీ కుండలము లపుడే పాతాళమును జేరిన” వని పలికెను. ఉదంకుఁ