పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామకృష్ణపరమహంస

67

విరాగులయి సన్యాసులగుదు రనియు నతఁడు చెప్పుచుండు. అనేక మహామహిమలుగల యీమహానుభావుఁడు కలకత్తానగరమున సమీపమందున్నను తత్పురవాసులు చాలకాలమువఱకతని నెఱుఁగనే యెఱుఁగరు.

బ్రహ్మసమాజ మతాచారుఁడగు కేశవచంద్రసేనుఁడు పరమ భాగవతుఁడై యొకతోటలో విరాగియై ప్రొద్దులు పుచ్చుచున్న వాఁడని విని రామకృష్ణుఁడాతనిఁజూడఁ బోయెను. అదిమొదలు వారికిరువురకు దృఢమయిన స్నేహము గలిగెను. కేశవచంద్రసేనుఁడు రామకృష్ణుని ప్రభావమెఱిఁగి వాని నాశ్రయించి సందియము లడిగి తెలిసికొని పరమభక్తిచె నతని పాదములు తన కన్నుల నద్దుకొని పలుమారు వాని దర్శించి బ్రహ్మజ్ఞానవంతుఁడై తుదకాయన సిద్ధాంతము లన్నిఁటి నవలంబించెనని చెప్పుదురు. ఈచంద్రసేనుఁడు రామకృష్ణుని బోధలఁ గూర్చియు చిత్రచరిత్రలను గూర్చియు నొక గ్రంథమువ్రాసి ప్రకటించెను. ఆపుస్తకము బయలువెడలిన పిదప కలకత్తా పురజనులు రామకృష్ణు నెఱిఁగిరి. అది మొదలు కలకత్తానుండియు బంగాలా దేశమునుండియు జనులు వందలకొలఁది వచ్చి సందియము లడిగి యతనిచేత బోధితులై బోవుచు వచ్చిరి. అప్పు డతనికి యీశ్వరావేశము సయితము వచ్చువాడుకఁ గలదు. ఆ యావేశము లేనప్పుడు సేవకులకయిన విధేయుఁడుగ నుండినట్టి యా మాహాత్ముఁ డదివచ్చినతోడనే తాను భగవంతుఁ డనియు దనవంటివారు లేరనియు పూర్వము రాముఁడు కృష్ణుఁడు బుద్ధుఁడు యేసుక్రీస్తు మొదలగువారై పుట్టినది తానేయని చెప్పుచుండును. అతని బోధనలు విని యందఱు సంతసించి తృప్తినొందుచు వచ్చిరి.

ఈ పరమ హంసకు 1886 వ సంవత్సరమున గంఠమునగురుపు వైచెను. ప్రజలకు మతబోధ మానుమని వైద్యు లెంతచెప్పినను