పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

చెన్నపురి ప్రభుత్వ ప్రాచ్యలిఖతపుస్తకభాండారములో ఈ కులశేఖరమహీపాలచరిత్రమునకుఁ దాళపత్రప్రతి యొక్కటియే కలదు. (డి. నం. 2077) ఇటీవలనే దానికి దుహితృక కల్పింపఁబడినది. (ఆర్. నం. 1071)

మాతృక అశిథిలమును దోషరహితము నగుటచే ముద్రణ ప్రతిసంపాదనము సుకర మైనది. చివరియాశ్వాసమున తుదిపద్యము లొండురెండును కావ్యమధ్యమున రెండు మూడు తావులలో నొకటి, అఱ, పద్యచరణములు మాత్రము త్రుటితములును లేఖక ప్రమాదవిసృష్టములు నని తెలుపవలసియున్నది.

అపరిహరణీయములగు నీనీహారలేశములను విడిచినచో నితరపూర్వకావ్యములవలె సందేహస్థలములలో బరిష్కర్తల వికల్పముల కెడమీయక యథోచ్చారితముగఁ బ్రకాశము నందగలుగుట యీ కావ్యవిషయమున నెన్నదగిన విశేషము. ఇందలి కావ్యగుణముల మేలిమి కీ మేలు కలిసివచ్చినది. ఇట్టిది యరుదు. శ్రీవైష్ణవమతప్రవర్తకులగు నాళ్వారులలో నన్యతముఁడును, సుప్రసిద్ధమగు ముకుందమాలకును ద్రవిడాగమైకదేశమగు పెరియతిరుమొ௶కినిఁ గర్తయగు కులశేఖరమహీపాలుని చరిత్ర మిందలి వస్తువు. ఆపస్తంబసూత్రుఁడును కౌండిన్యగోత్రుఁడునగు శేషము రఘునాథాచార్యుఁడు దీనికిఁ గర్త. ఇతఁడు ప్రస్తావనలో నిరూపించిన తనవంశక్రమ మిది:—