పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi


పినతమ్ముఁడు చెన్నభట్టరు, తన యభిమన్యుకల్యాణములో రఘునాథాచార్యుని నిట్లు స్తుతించెను.

"అందగ్రజుఁడు సద్గుణాభిరాముండు
నందనందనకథానందచిత్తుండు
శమదమవాత్సల్య సౌశీల్యముఖ్య
కమనీయగుణరత్న కలశవారాశి
యమలవైష్ణవరహస్యార్థసంవేది
రమణీయశుభకీర్తి రఘునాథగురుఁడు.”

ఈ అభిమన్యుకల్యాణము రసోత్తరమయిన ద్విపదకావ్యము. ఇది యీగ్రంథాలయమున డి. నం. 1022-1027 రులలో వర్ణితము. ఇది యముద్రితము. ఈచెన్నభట్టరుకుమారుఁడు రంగాచార్యుఁడును సరసకవి. భావనారాయణవిలాసమను ప్రశస్తయక్షగానమును రచించెను.

"ఇది శ్రీమన్నందనందనచరణారవిందద్వంద్వనిష్యందిమరందబిందుమదవదిందిరాయమాణ మానసశేషవంశాబ్ధిసుధాకర చెన్నభట్టారకకుమార రంగాచార్యప్రణీతంబైన భావనారాయణవిలాసంబు" అని దానిగద్య.

ఇది యీ గ్రంథాలయమున డి. నం. 1981 రున వర్ణితము. వీరివంశము పరిపాటి యిట్టిది. అందఱును విద్వత్కవులే. భావనారాయణవిలాసమునందలి యితివృత్తము ముచ్చటయైనది. గుంటూరిమండలము పొన్నూరు గ్రామమునకు గూనిగోవిందుఁడను భక్తునిచేఁ దనవైవాహికవిషయమున మేనమామకడకు సాక్షిగఁ గొనితేఁబడి సాక్షి భావనారాయణుఁ డనపేర నచట నిలిచిన స్వామి మాహాత్మ్య మిందు వర్ణితమైనది.

చెన్నభట్టరు రచించిన యభిమన్యుకల్యాణమునందలి వస్తువుకూడ దాదాపుగ నిట్టిదియే. కన్యాప్రదానవిషయమున నాడినమాట తప్పఁ జూచిన మేనమాను, సాక్షియైన నారాయణుని యనుగ్రహమునఁ దుదకు గృతార్థుఁడైన మేనల్లుఁడును, ఈ తండ్రికొడుకుల కృతులలో సమానముగ గోచరింతురు. రంగాచార్యుఁడు గ్రహించిన యితివృత్తము పొన్నూరునకు సంబంధించినదగుట నీశేషమువారు గుంటూరుమండలవాస్తువ్యులై యుందురనునూహ కెడమిచ్చుచున్నది. రఘునాథాచార్యుల కాలనిర్ణయమునకుఁ బ్రకృతకావ్యమునందుఁ

గాని తమ్ముఁడు చెన్నభట్టరు కృతిలోఁ గాని, తత్పుత్రుని కృతిలోఁ గాని యాధారములు గనవచ్చుట లేదు.[1]

  1. శ్రీ నిడదవోలు వేంకటరావు గారు Journal of University of Madras Sections A. Humanities Vol. XXIII Nos. 1-2. (July-December) Pages (57-61) లో Kulasekhara in Telugu Literature అనువ్యాసములో నీరఘునాథాచార్యుల కాలమును నిర్ణయించిరి. అందు వారుచూపిన యాధారములలో మొదటిది. రామదాసకృతమగు దాశరథిశతకము 9వ పద్యములో "రఘునాథభట్టరాచార్యుల కంజలెత్తి" అనునది. కాని గోత్రగృహనామములు తెలుపఁబడని ఈ రఘునాథభట్టరు, ప్రకృత రఘునాథాచార్యులు కాకపోవుటకుగల సంభవమును, రఘునాధసంజ్ఞికులు పలువు రుండకుండుటకుఁగల యసంభవమును దీనికి బాధకములుగ నున్నవి. రెండవది. కులశేఖరచరిత్ర అభిమన్యుకల్యాణములలోని ప్రస్తావనలకు అంబరీషోపాఖ్యానప్రస్తావనోదాహృతపద్యను జోడించి వా రొసగిన శేషమువారివంశవృక్షము. అంబరీషోపాఖ్యానకృతికర్త తిరుమలాచార్యుఁడుకూడ శేషమువంశజుఁడును కౌండిన్యగోత్రుఁడును. అందు తిరుమాలాచార్యుఁడు తాను నారాయణార్యసంభవుఁడనని చెప్పికొనెను. శ్రీ వేంకటరావుగారు తా మొసగిన వంశవృక్షములో 'నారాయణాచార్యుని' అహోబలదేశికుని పుత్రపంచకములో నన్యతమునిగా జేర్చిరి. అభిమన్యుకల్యాణ, కులశేఖరచరిత్రములలోనహోబలదేశికుని యగ్రనందనుఁడని రామానుజాచార్యుఁ డొక్కఁడే పేర్కొనఁబడెను. కడను నలువురినామములు పేర్కొనఁబడలేదు. తిరుమాలాచార్యుఁడు తనకృతిలో దండ్రినిమాత్రమే పేర్కొనెను గాని, తాతపేరు తడవినవాఁడు కాఁడు. ఇట్టిస్థితిలో నహోబలదేశికునకు నారాయణచార్యుఁడు కుమారుఁ డనుట, యూహైకసాధ్యము కాని ప్రమాణసిద్ధము కా దనవలసివచ్చుచున్నది. ఆది పొసఁగిననే కాని తిరుమలాచార్యుని యంబరీషోపాఖ్యానమును బట్టి వారు చేసిన రఘునాథాచార్యుని కాలనిర్ణయము పొందుపడదు. ప్రతివాదమునకులోఁ గని ప్రమాణాంతరములు లభించునంతవఱకు రఘునాథాచార్యుని కాలనిర్ణయవిషయము పరిశీలనార్హమైయున్నది.