పుట:Krxshhiivaludu (1924).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

ఆంధ్రవాఙ్మయమున ప్రకృతము ప్రసిద్ధికి వచ్చుచుండెడు గణ్యములగు నూతనసృష్టులలో నీకావ్య మొకటి. విషయమందును భావములందును ఇయ్యది మనదేశముయొక్క నవజీవితమునకుం జేరినది. అచ్చటచ్చట శైలియందును దూరోపమలు మొదలగు నలంకారముల యందును ప్రాచీనవాసన యింకను కొంత వదల వలసియున్నటుల తోచెడిని.

కవి కాపుయువకుడు; విషయము కాపులజీవితము; దృష్టి యభిమాన ప్రేరితము. కృషీవలుల జీవితమును ప్రథానాంశముగ గ్రహించిన తెలుగు గ్రంథములలో నిదియె మొదటిది. ఈవిషయ నవ్యతను దలంచియ కాబోలు రామిరెడ్డిగారు ఈక్రింది విధముగ వితర్కించి యుండుట :

అన్నాహాలిక, నీదు జీవితము నెయ్యంబార వర్ణింప మే
కొన్నన్ నిర్ఝరసారవేగమున వాక్పూరంబు మాధుర్యసం
పన్నంబై ప్రవహించుఁగాని, యితరుల్‌ భగ్నాశులై యీర్ష్యతో
నన్నుం గర్షకపక్షపాతియని నిందావాక్యముల్ వల్కరే?