పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుగా వ్యవహరించితిని. శాసనసభాసభ్యులుగా నుండిన మోచర్ల రామచంద్రరావుపంతులుగారుకూడ హాజరైరి. బీదలకు ఉచితముగ విద్యనేర్పుటయేగాక మధ్యాహ్నమునందు భోజనమునకు వసత ఏర్పరుచుటకు ప్రభుత్వమువారు, విద్యాశాలాధికారులు గ్రాంటులిచ్చుట అవసరమని నా యుపన్యాసమున వచించితిని. రామచంద్రరావుగారు అది బాగుగనేయున్నది గాని సాధ్యము కాదని నిరసించిరి. ఈసభ జరిగినపిమ్మటనే స్వదేశోద్యమము ప్రారంభమై ప్రచారము తీవ్రముగ సాగి ప్రభుత్వమువారికి వేడిపుట్టించుకాలముననే తెనాలిలో కాంగ్రెసుసంఘయాజమాన్యమున మహాసభ యొకటి సమావేశమయ్యెను. ఈసభలో పాల్గొన్నవారికి ప్రభుత్వమువలన అపకారము కలుగునేమో యను సందేహము ప్రజలలో వ్యాపించెను. ఆసభకు నేను అధ్యక్షత వహించుటకై బండి ఎక్కబోవుచుండగా మాతంరిగారు "నిన్ను జనులు కోరుటయు నీవు అంగీకరించి సభలో అధ్యక్షతవహించుటకు బోవుటయు గౌరవముగ నున్నది గాన నాకు ఆనందముగనే యున్నది గాని నీవు మాత్రము సర్కారువారి వలన ఉపద్రవము రాకుండ తగుజాగ్రత్తతో ప్రవర్తించవలసిన"దని మెల్లగ హెచ్చరికచేసిరి. వారి హృదయమున గల సందేహమును గ్రహించితిని గాని అందువిషయమై భయ మేమియు నాకు గలుగలేదు.

తెనాలిలో ఈసభ 1907 లో జరిగినదని జ్ఞాపకము. ఈ సభకు పలువురు హాజరైరి. పోలీసువారు కొందరు సభ నిమిత్తము వేయబడిన పందిరవెలుపల తిరుగాడుచుండిరి. పోలీసులు లోనికి రాకూడదని తెలియపరచితిని. దానిపైనొక