పుట:Konangi by Adavi Bapiraju.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనంతలక్ష్మి స్నేహితురాండ్రందరూ వచ్చినారు.

“ఏమయినారు? ఎక్కడికి వెళ్ళినారు?

డాక్టర్ అందరితో మాటలు చెబుతూ “అనంతలక్ష్మీదేవీ, జయలక్ష్మిగారూ, మధుసూదనరావూ, సరోజినీదేవిగారూ, కమలనయనా, అమ్మా పార్వతీ అంబుజంగారూ, మీరంతా వినండా. “శ్రీ చౌధురాణీ దేవి నన్ను... నన్ను... వివాహమాడ... అంగీకరించినారని మీకు విన్నవించడానికి ఎంతో ఆనందపడుతున్నాను” అన్నాడు.

ఈ మాటలు అంటాడని తనవైపు డాక్టరు పరపిన చూపులను చూచి అప్పుడే గ్రహించుకుంది చౌధురాణీ. కాని 'కోనంగిరావు అప్పుడే డాక్టరుకు ఎప్పుడు చెప్పినాడు? అని అనుకుంటూ చిరునవ్వుతో కూర్చుంది. ఆమె కపోలాలు కేంపులెక్కినాయి.

అందరు బాలికలు చౌధురాణీని అభినందించారు. జయలక్ష్మి పకపక నవ్వుతూ ఆనందంతో చౌధురాణీ దగ్గరకు వచ్చి గట్టిగా కౌగలించుకుంది. అనంతలక్ష్మి తెల్లబోయింది.

ఆమె అనరాని మాటలు ఆడిపోసుకొని భర్త హృదయమును నొప్పించిన మరుక్షణంలోనే “ఎంత తెలివితక్కువ దాన్ని” అని విచారించింది. భర్త తెల్లబోయి పిచ్చివానిలా అయిపోయినస్థితి చూసింది. ఆమెకు గాఢమైన పశ్చాత్తాపం కలిగి, ఎంతటి మూరురాలను అని లోన దుఃభించింది. ఎవ్వరూ తన్ను భర్త దగ్గరకు పోనీయలేదు ఆ క్షణంలో.

తాను ఎవ్వరో దుష్టురాలిలా, చెట్టిగారులా భర్తను అవమానించింది. రాత్రంతా నిద్రలేకుండా భర్త బాధపడడం చూచింది. తాను గర్భము ధరించితినేమో అన్న అనుమానం ఆమెకు అప్పుడే నెలరోజుల క్రిందటనే కలిగింది. అప్పటికి రెండుసారులు నెల తప్పినది. తనకు కలిగిన వికారము, బద్దకము మొదలయినవన్నీ ఆ అనుమానాన్ని దృఢపరిచినాయి. తన అనుమానం తల్లితో చెప్పింది. “అవునమ్మా! నిజం కావచ్చు. అయితే మన్నారుగుడి స్వామికి భోగం చేయించనా! వెంకటేశ్వరులకు భోగం చేయించి ముత్యాలహారం అర్పించుకోనా!” అన్నది. ఆమే కొమరితను హృదయాని కదుముకొని ఆ రాత్రి దిగదుడుపు తీసి వీధి మధ్య పడవేయించింది..

జయలక్ష్మి కొమరిత స్థితి కనిపెట్టి అనుమానించింది. కొమరితకు తలంటి నిశ్చయం చేసుకుంది. కాని కొమరితతో మాత్రం నిజం చెప్పింది కాదు. శుక్రవారంనాడు పార్ధసారధి కోవెలలో భోగం చేయించింది.

చదువుకున్న బాలిక గనుక ఏమనుకుంటుందో అని తన అభిప్రాయం కూతునకు చెప్పక దాచి, కూతునుంచే మాటలు వచ్చునని కని పెట్టుతూ ఉన్నది. అందుకనే డాక్టర్ “అనంతలక్ష్మిని పరీక్ష చేయించండి!”, అని అన్నప్పుడే ఆయన ఈ రహస్యము గ్రహించినారని అర్థం చేసుకుంది..

అనంతలక్ష్మి ఆ రాత్రే భర్త దగ్గరకు పోయి క్షమాపణ వేడుకుందామనుకుంది. అతని కౌగిలిలో వాలిపోదామనుకుంది. అతని ముద్దులతో పరవశమయిపోదామని ఉవిళ్ళూరింది. కాని కోనంగి తన మాటలను అంతతీవ్రంగా విమర్శించుకుంటాడని ఆమె ఎల్లా గ్రహించుకోగలదు? ఎన్ని సారులో తాను పండుకొన్న మంచంమీద నుండి లేచి శయనమందిరానికి పయనమయింది.

కూతురు ఆమె భర్త దగ్గర కారాత్రి వెళ్ళకపోవడానికి కారణం ఆమె గర్భవతియై కొంచెం అలసత్వం పొంది ఉండడమే కారణమని జయలక్ష్మి అనుకొన్నది.