పుట:Konangi by Adavi Bapiraju.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనివాళ్ళ పనితనంబట్టి జీతాల తేడాలున్నాయి. రోజుకు రెండుగాలీలన్నర వారు డెబ్బది అయిదు రూపాయలవారు. రెండుగాలీలవారు కాని మంచి పనివారికీ అంతేజీతం. అక్కడ నుంచి అరవై, ఏభైవరకూ ఉన్నాయి. కార్యాలయ బాలురకు ముప్పది రూపాయల జీతం. స్త్రీ యెడిటర్లకు నూటడెబ్బదిఐదు చొప్పున ఏర్పాటు చేసుకున్నారు.

పెట్టుబడికి, వడ్డీకి-యంత్రాలు, టైపులు అరుగుదలకు ఇంతంత మొత్తము తీసివేయగా, జీతాలు నాతాలు ఖర్చులు పోగా మిగతా మిగిలిన సొమ్ములో ప్రావిడెంటు ఫండు, బోనసులు ఏర్పాటు చేశారు. సెలవలు, జబ్బు సెలవలు, పని సెలవలు ప్రతివారికి సమంగా ఇచ్చారు. కోనంగికి రెండువందల యాభై రూపాయల జీతం.

పత్రికా నిర్వహణంలో అందరికీ సమంగా ఓట్లు ఉన్నాయి. పత్రికలో పని చేస్తుంటే ఇతరులు చూచి ఆశ్చర్యపడుతూ వుంటారు. ఎవరిపని వారు చేసుకుంటారు. పని సరీగా జరుగుతుంది.

కోనంగి దేశంలో అల్లకల్లోలం ఏంటూ హింస లేకుండా వుంటే బాగుండునంటాడు. డాక్టరు ఏదీ వుండకూడదు అంటాడు. రియాసత్ ఆలీ ఫరవాలేదులే, దేశానికి ఆమాత్రం మగతనం ఉండవద్దా అంటాడు. మధుసూదనుడు “ఇంకా చాలదు. ప్రతి కలెక్టరాఫీసూ, ప్రతి కోర్టూ అంటుకుపోవాలి. ఇదే సమయం జపానువాడు రావడానికి. ఆసాంవరకూ వచ్చి ఆగిపోయాడే నాయనమ్మ. అసలు అమెరికా మీదకు వెళ్ళకూడదు” అంటాడు.

చౌధురాణీ, సరోజినీ, అనంతలక్ష్మి ఆనందము పడుతున్నారు. హడలిపోతున్నారు.

2

ప్రూఫురీడరు సుబ్బారావు జ్యోతిష్కుడు. ఆయన ఈ యుద్దం చాలా కాలం ఉంటుందనీ, ప్రపంచం మారిపోతుందనీ, ఇదంతా యూరేనస్ పని అనిన్నీ అంటూ ఉండేవాడు.

దేని పని అయితేనేమి, హిందూదేశం అల్లకల్లోలంగా ఉంది. కోనంగి మాత్రం ఏమీ కల్లోలంకాని హృదయంతో ప్రభుత్వాన్ని కొంచెం ఘాటుగానే విమర్శిస్తూ సంపాదకీయాలు సాగించాడు.

డాక్టరు రెడ్డిగారికి చౌధురాణీపై ప్రణయం అవిలంబనీయమయిపోయింది. ఆయన మాట్లాడలేదు. తాను తనకూ స్త్రీలకూ ఇదివరకున్న సంబంధము చౌధుతో చెప్పాలా, వద్దా? అని కోనంగితో ఆలోచించాడు. కోనంగి నువ్వు రెండు కారణాలవల్ల చెప్పాలి అని అన్నాడు. ఒకటి ప్రాపంచికంగా ఆలోచిస్తే వచ్చేది. ముందు ముందు ఏలాగో ఈతని ఒకనాటి జీవితం చౌధురాణీకి తెలిస్తే ఆమె మనస్సు విరిగిపోవచ్చును అని, రెండవది ధర్మ దృష్ట్యా ఆలోచించవలసినది. చేసుకొనబోయే భార్యకూ భర్తకూ మధ్య ఏ రహస్యాలూ ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీ పురుషులకు సంబంధించినది కనుక అని.

డాక్టరుకు మొదటి కారణం నచ్చినా, రెండవ కారణం నచ్చలేదు. ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకొనడానికి? నువ్వే జాగ్రత్తగా ఆమెకు చెప్పవయ్యా అని కోనంగిని కోరినాడు డాక్టర్.

దీనివల్ల తనకూ చౌధురాణీకి అసలే సంబంధం కలక్కపోవచ్చును అని డాక్టర్ రెడ్డి అనుకున్నాడు. స్త్రీల మనస్సులు విపరీతమయినవి. ప్రేమించి లేదంటారు. ప్రేమించకుండా ప్రేమించినట్లు నటిస్తారు. ఒకనాడు ప్రేమించి, మరునాడు నీకూ నాకూ