పుట:Konangi by Adavi Bapiraju.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయలక్ష్మి శెట్టిమీద మండిపోతోంది. వీడు తన కుటుంబానికి రావణాసురు డయ్యాడు. ఎక్కడ నుండి దాపురించాడు? ఇంతకూ అమ్మిణి అన్నట్లు వాడు తన ఇంటిలో అడుగుపెట్టడానికి కారకురాలు తానే! అప్పుడే వాణ్ణి రానీయ వద్దంది. వాడిని చూస్తే తనకు భయమంది వెట్టితల్లి. అన్నీ తాను సాలెగూడు దులిపినట్లు దులిపి పారేసింది. ఈనాడు తాను అనుభవిస్తోంది, తన కూతుర్ని అనుభవింపచేస్తోంది. ప్రాపంచికంగా లాభం ఆశించేవారికి, ఆ రకంగానే చెంపదెబ్బలు పెళ్ళున తగులుతాయి.

కోనంగిరావుగారు ఎన్ని సంవత్సరాలకు బయటపడతాడో! అందాకా అనంతలక్ష్మి కృంగిపోతూ ఉంటుంది. కోనంగిరావు పరీక్షలకు తయారుజేస్తే మొదటితరగతిలో ప్యాసయింది.

శోభనమహెూత్సవ ప్రథమ దివసంనాడే అతడు వెళ్ళిపోవలసి వచ్చినది. భోజనంచేస్తూ మొదటిముద్ద తిన్నవానిని ఆ తక్షణం లేచి పొమ్మనట్లు, యువతీ యువకులలో ప్రథమ ప్రేమదినాలకన్న మహదానందం సమకూర్చే వస్తువు లింకేమి ఉన్నాయి?

జయలక్ష్మికి రంగయ్యంగారు తన్ను ప్రేమించిన దినాలు జ్ఞాపకం వచ్చాయి. భవభూతి ఉత్తరరామాయణంలో “రాత్రిరేవ వ్యరంగీత్” శ్లోకం చెప్పినట్లు చెంప చెంపకు చేర్చి ఒక్కక్షణమైనా విడిపోని కౌగిలిలో, అర్థంలేని పిచ్చిమాటలు చెప్పుకుంటూ కునుకయినా ఎరుగని ఏదో మధుర మత్తతలో గడిచిపోయేవి ఆ దినాలు.

విడిపోవడం మరీ గాఢంగా కలుసుకొనడానికే! స్త్రీ పురుషుల జీవితంలో ప్రేమావస్థ ఎక్కడో ఆకాశంలో ఉండే ఉత్తుంగశిఖరం.

ప్రేమికులు ప్రయాణాలు చేయడం ఆనందం. తానూ రంగయ్యంగారూ, రెండు సీట్లు ఉండే మొదటితరగతిలో ప్రయాణంచేస్తూ ఉత్తమక్షేత్రాలన్నీ యాత్రలు సలిపినారు.

ప్రేమికులు ఒక్కొక్కచోట ఒక్కొక్క రకమయిన ప్రేమానుభవం పొందుతారు. ప్రేమ ఒక మహాపుష్పమయితే ఒక్కొక్క ప్రేమానుభవం ఆ పుష్పంలోని ఒక్కొక్క పుటవంటిది.

అంత ఆచారపరుడయ్యూ తన భర్త తన వంట తినేవాడు. వైష్ణవ దేవుడు కృష్ణుడు గొల్లవాడట. రాముడు శబరి ఎంగిలి తిన్నాడట.

తామిద్దరూ బృందావనం దగ్గర యమునాతీరంలో ఒక అడవిలో మకాం పెట్టినప్పుడు తాను వంట చేసింది. తాను వంట చేస్తుంటే, త్యాగరాజ కృతులు పాడుతూ నాట్యం చేశాడు. భర్త నాట్యంచేసి వచ్చి వంటచేసే తన్ను గాఢంగా కౌగలించుకొని పెదవులు ముద్దుకొంటూ “జయా, నువ్వు నా కర్పించేవన్నీ దివ్యామృతపు విందులేవే” అన్నారు. ప్రేమ! ఓహెూ ప్రేమ!

7

అనంతలక్ష్మి పెళ్ళి సందర్భంలో మదరాసు పతిత జనోద్దరణాశ్రమానికి అనంతలక్ష్మి వెయ్యి నూటపదహారు రూపాయలు చదివించింది. తన గురువూ, తన భర్త అయిన కోనంగిరావు “నాబోటి కులహీనులను, చరిత్ర హీనులను, సంరక్షించటానికి ఏర్పాటయిన యీ సంఘానికి నువ్వు వెయ్యి నూట పదహార్లివ్వటం యెంతో భగవతీతికరం, అనంతా!” అన్న మాటలు అనంతలక్ష్మికి జ్ఞాపకం వచ్చి కళ్ళనీళ్ళు తిరిగినవి. తన భర్త ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నట్టే ఆమెకు తోచింది. ప్రేమకు అంతరాయం కలిగినప్పుడే దాని గంభీరశక్తి వ్యక్తుల జీవితాల చుట్టూను, జీవితాలలోనూ స్పందిస్తుంది.