పుట:Konangi by Adavi Bapiraju.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తువాళ్ళబదులు చదరపు చేతిరుమాళ్ళుండేవి. స్నానం చేయడానికి గోచీగుడ్డ లుండేవి. అందరూ కలిసి మలవిసర్జనకు పోయేవారు. అదైనా నియమిత కాలంలో ముగించాలి. వ్యవధి ముగియగానే కూడా ఉన్న వారు ‘టెంషను' (అటెంషను) అంటాడు. అందరూ లేచి శుభ్రం చేసుకొని వచ్చి వరుసగా నిలబడాలి. ఈ విషయమై జైలు నియమాలలో ఒకటి “నిష్కారణంగా మలమూత్ర విసర్జనం చేయరాదు” అని.

కాళ్ళకు కడియాలు, మెళ్ళేపుస్తెల్లా ఖయిదీల వరుస సంఖ్య, వెళ్ళే అవి యిప్పుడు లేవు. బేడీలు తీసివేశారు, పాయిఖానా అందరూ కనబడే బందెలదొడ్డిగాగాక, విడి విడి దొడ్లుగా ఏర్పాటు చేశారు.

పూర్వం జైలు తిండి అధ్వాన్నంగా ఉండేది. జైలు అధికారుల స్వంత ధనాగారం నింపే పెద్ద సంస్థలలో జైలు భోజనపు సంస్థ ముఖ్యమైనది.

మనుషునకు ఇరవైరెండు తులాల బియ్యం ఇవ్వవలసివస్తే, బియ్యంలో పదితులాల బియ్యం జైలు అధికారుల జేబులలోనికే! అలాగే కూరగాయల విషయంలో, ఉప్పు, పప్పు, నూనెల విషయంలో, ఇంక కారాగార నివాసుల కడుపుల్లో, తుక్కూదూగరా, మండే మశానమూనూ!

ఇప్పుడు కాంగ్రెసు బందీలు పూర్తిగా రేషను పుచ్చుకొని తామంతా కలసి వేరే వంట చేసుకోవడమే! నెయ్యి, మజ్జిగలు, వచ్చాయి. గోధుమలు తినేవారికి గోధుమలు వచ్చాయి.

ఆ కోనంగీ, రెడ్డి లోనకు రాగానే అదివరకే అక్కడ ఉన్న పన్నెండుగురు రాజకీయ నిర్బంధితుల జట్టులో చేరారు. డాక్టరు రెడ్డి తన ఊరగాయలు తెప్పించుకోవచ్చునట! తన పరుపూ, పక్కా కాంపుకాటు అన్నీ తెచ్చుకోవచ్చును.

జైలు ఎట్లా ఉంటుందో అని ఏవేవో ఊహించుకున్నాడు కోనంగి. ఊహకు మించే ఉంది అసలు జైలు.

అతనికి ప్రత్యేకం ఒక గది. నామకఃతువాళ్ళు కొసలు ముడివేయ్యడం పని. పుస్తకాలు తెచ్చుకోవచ్చును. వ్రాతకు పెన్సిలు, తెల్లకాగితాల పుస్తకమూ ఇచ్చారు. నెలకు రెండుసార్లు ఉత్తరాలు వ్రాసుకోవచ్చును. రెడ్డిగారు వారానికోసారి వ్రాసుకోవచ్చును. అలాగే చుట్టాలూ, స్నేహితులూ వచ్చి చూడడమూ అంతే. అక్కడ నుండి అనంతలక్ష్మికి ఉత్తరం వ్రాయడం ప్రారంభించాడు కోనంగి.

కడలూరు జైలు

బ్లాకు ఎనిమిది

గది పద్దెనిమిది

కారాగారవాసి

నెం. 2056 రు

6 ఏప్రిల్ 1942

ప్రియమైన అనంతా!

ప్రాణం నీ దగ్గిరే మరచిపోయి వచ్చి ఉంటాను. మొన్న నా పక్క చుట్టలలో, ఇతర సామానులలో వెతికాను. ఎక్కడా కనపించందే! నీ దగ్గర మరచిపోయిన వస్తువును ఎల్లాగ మరచిపోయాను, అది కాస్త జాగ్రత్తగా చూస్తూ వుండు.

నీకు నేను ఇంతవరకు ఒక ఉత్తరమన్నా వ్రాయడానికి వీలులేకపోయింది. తీయతీయని పరిమళాల ఉత్తరాలు నీకు వ్రాసే అదను కల్పించినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు.