పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

175


అయినప్పటికిని ఇప్పటివఱకు తెలుగువారము తెలుగువారము గానే ఉన్నాము, భాగవతము చదివినప్పుడు ఒడలు పులకరింపని ఆంధ్రు డుండడు. భారతము విని తలయూపని తెలుగువా డుండడు ఇవి మన జాతీయసిద్ధులు. వీనిముందు తక్కిన నా వెల్టీలు హనుమంతుని యెదుట కుప్పెగంతులు.

నారాయణబాబుగారు తాము రచించిన వచన పద్యములను ఒకతూరి వినిపించిరి. వానియందు ఈ ఫిడేలరాగాల డజన్‌లో లో వలెకాక, ఉన్నతములైన భావములుండినవి. ఆయనకు ఏపద్యమైనను చక్కగా చదువగల శక్తి కలదు. ఆ పద్యములందు ఒక దానితో నొకటి పొందిపొసగని లయా ఖండములు (Mosaic of rythm) వినిపించినవి. ఛందస్సును త్యజించితిమంటిరే వీనిలో లయాఖండములు గోచరించుటకు కారణమేమని యంటిని. (వానిలో ద్విపద పాదములు, గీత పద్యముల తుంటలు కనబడినవి). ఇవి ఆకాంక్షితముగ పడినవని వారనిరి.

గుడిపాటి వెంకటచలంగారు రాగాలడజన్ పై అభిప్రాయము ఒక వచన పద్యమున వ్రాసిరి. ఆ పద్యము చదివినప్పుడు, . వీరు చందోబద్ధముగ వచ్చు కవిత్వమును కేవలము నవత్వముకొరకు అవయవ విచ్చేదము చేసియుందురని నా యూహకు తట్టినది. నా యూహ యదార్థము కాకపోవచ్చును. ఈ నిదర్శనములు గమనింపుడు.

వేయి కన్నీటిచుక్కల వేడిగాను.
చెవుల ఘోషించి కలవరపరచగలవు,

ఇవి రెండును పరిపూర్ణముగ తేటగీతి పాదములు.