పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

24

- గణనిర్ణయము. -

గురులఘువులు మూఁడేసి కూడిన నొక్కగణ మగును. మూఁడుగురువులైన మగణ మగును. అన్నియు లఘువు లైన నగణము. ప్రథమద్వితీయతృతీయాక్షరములు మాత్రమే గురువులైనచో నాగణములకు భ, జ, స, లనియు, నాయక్షరములు మాత్రమే లఘువులైనచో వానికి య, ర, త, లనియుఁబేళ్లు. ఇవి యన్నియుఁ జేరి యెనిమిదిగణము లైనవి. వీని కక్షరగణములనిపేరు. వీనిలో సమానమాత్రకము లగుగణములు సయిత మొకదానికి వే ఱొకటి ప్రయోగింపరాదు.

అక్షరగణములకంటె భిన్నములైనవి మాత్రాగణములు. ఈగణములలో మాత్రాసంఖ్యయే ప్రధానముగాని, గురులఘు వర్ణక్రమము ముఖ్యము గాదు. ఎట్లన : __ సీసపద్యమం దింద్ర గణములు సూర్యగణములు వచ్చును. ఇంద్రగణము లాఱును సూర్యగణములు రెండును గలవు. వీనిలో నేదియైనను బ్రయోగింపవచ్చును. ఆప్రకారమే చంద్రగణములును.

ఈమాత్రాగణములకు జాతులలో వినియోగము. దేశ్య జాతులలో వచ్చుగణములు సూర్యగణము లనియు, నింద్రగణములనియుఁ జంద్రగణము లనియు మూఁడు విధములు. ఇవి వరుసగా రెండు, మూడు, నాలుగు గురువులఁ బెట్టి ప్రస్తరింపఁగాఁ బుట్టును, ఎట్లనిన :--