పుట:Kashi-Majili-Kathalu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21]

కపింజలునికథ

161


పిమ్మట నొకనాఁడు ప్రాతఃకాలమున నిద్రలేచి చూచినంత నాదారు పంజర మేమైనదో తెలియదు. నేనీ బంగారుపంజరములో నుంటిని. ఆకన్యక యిట్టి దివ్యరూపముగలదై యొప్పెను. దేవర జూచియే యున్నారుగదా! మఱియు నామాలపల్లి యమర నగరసమానమై ప్రకాశించుచుండఁ జూచి నేను పుల్కనపురవాస పరితాపము విడిచి యాశ్చర్యమందుచు నిది యేమని మౌనము విడిచి యప్పఁడతి నడుగుదమని యెంతలోఁ దలంచుచుంటినో యంతలో నీకాంతారత్నము నన్నిక్కడికిఁ దీసికొనివచ్చినది.

మహారాజా! ఈసరోజానన యెవ్వతెయో యెందులకై యిట్లు చండాలరూపత్వము ప్రకటించినదో నన్నెందులకుఁ బట్టించినదో యిప్పుడు నన్నిక్కడి కేమిటికిఁ దీసికొనివచ్చినదో నాకేమియుం దెలియకున్నది. దేవరవోలె నీకథ వినుటకు నేనుగూడ నుత్సుకము గలిగి యుంటినని యాచిలుక చెప్పినది.

ఆకథ యంతయును విని యమ్మహారాజు ఆవార్త వినుటకు మిక్కిలి కుతూహలము గలవాఁడై వాకిటనున్న యామాతంగకన్యం దీసికొని రమ్మని ప్రతీహారి కాజ్ఞాపించెను. అదివోయి యిటురమ్మిటు రమ్మని పలుకుచు నాకలికిం దీసికొనివచ్చి యెదుర నిలిపినది. అప్పు డావాల్గంటి భూమినంటకయే నిలువంబడి తన తేజంబున నన్నృపునిఁ బరాభవింపుచుఁ బ్రౌఢముగా నిట్లు పలికినది.

భువనభూషణ! రోహిణీనాథ! తారారమణ! కాదంబరీలోచనానందచంద్ర! ఈదుష్టుఁడు తనయొక్కయు, మీయొక్కయు వృత్తాంతమంతయు మీకు వినిపించెంగదా! జాబాలియాశ్రమము విడువవలదని తండ్రిగారిచే నియమింపఁబడియుఁ దదాజ్ఞ నుల్లంఘించి కామరాగాంధుండై మహాశ్వేతయొద్దకుఁ బ్రయాణమైనవార్తయు మీకు విదితమే.