374
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
బాలుఁడవై బంధువులకును కుమారుఁడవై గురువులకును యౌవనవంతుఁడవై కులస్త్రీలకును వృద్ధుఁడవై వనచరులకును సంతోషము గలుగఁజేయుదువుగాత. రాజ్యముచేయుచు మిత్రుల మురియఁజేయుము. సాధువుల రక్షింపుచు దుష్టులగు వైరుల నిర్జింపుము. గోబ్రాహ్మణరక్షకై మృత్యువును బొందుము. అని యుపదేశించినది.
అయ్యలర్కుం డట్లు నిత్యము తల్లిచే బోధింపఁబడుచు వయసుచేతను బుద్ధిచేత నభివృద్ధి నొందుచుఁ గౌమారప్రాయంబున నుపవీతుండై యొకనాఁడు మదాలసకు నమస్కరించి యిట్లనియె. అంబా ! ఆముష్మికసుఖంబుకొఱకు నేనిప్పు డేమిచేయఁదగినదో యుపదేశింపు మని యడిగిన జనని యిట్లనియె వత్సా! నీవు పట్టాభిషిక్తుండవైనది మొదలు ప్రజల రంజింపఁ జేయవలయును. నృపుల కదియే ముఖ్యధర్మము. మూలచ్ఛేదకములగు సప్తవ్యసనముల విసర్జించి మంత్రముల వెల్లడిగా నీయక శత్రువులవలనఁ దన్ను రక్షించుకొనవలయును మంత్రుల దుష్టా దుష్టచర్యల నరయుచుండవలయును. చారులవలన శత్రుమర్మములఁ దెలిసికొనుచుండుము. రాజు మిత్రుల నాప్తుల బంధువులనైన నమ్మియుండఁగూడదు. కార్యావసరమునుబట్టి శత్రువునైన నమ్మినట్లభినయింపవలయును. రాష్ట్రకోశవృద్ధిక్షయముల విమర్శింపుచుండవలయును. తొలుత హృదయశత్రువులగు కామక్రోధాదుల జయించి పిమ్మట బాహ్యశత్రులపై దాడివెడలవలయును.
కామమువలనఁ బాండురాజును క్రోధమువలన ననుహ్రాదుఁడును లోభమువలనఁ బురూరవుఁడును మదమువలన వేనుఁడును మానమువలన ననాయువును అమర్షవలన బురంజనుండును జెడిపోయిరి. రాజు పురుగు దారువునుదొలిచినట్లు తెలియకుండ శత్రువును వంచింప వలయును. పిపీలికవలె సంపాదించి అగ్నివలె వెలుఁగుచు శాల్మలీబీజమువలె నడఁగి వృద్ధిబొందవలయును. నరపాలుఁడు ఇంద్రసూ