పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాశీమజిలీకథలు - మూడవభాగము

లోనుండవలయు. నీవిషయము మాతండ్రికి దెలిసినచో అనుమతింపడు కావున రహస్యముగా నుంచవలయును. సుడీ! అనిచెప్పి అంతటితో నాగోష్టి చాలించె.

అది మొదలు ప్రతిదినము అయ్యుపాధ్యాయుడు వచ్చినతోడనే యారాజ కుమారుండు ఆర్యా! దేవాలయమునకు మఠమునకు బోయితిరా? యెవ్వరేని పెద్దలు గనంబడిరా? యే వేని విశేషములు దెలిసికొంటిరా? అని అడుగుచుండ నాయనయు నేనుందగిన ప్రయత్నము చేయుచుంటి నింతవఱ కేవిశేషము దెలియబడలేదని యుత్తరము చెప్పుచుండును.

మఱికొన్ని దినములు గడిచిన వెనుక నొకనా డయ్యుపాధ్యాయుండు సంతోషముతో వచ్చి రాజపుత్రు నేకాంత ప్రదేశమునకుదీసికొనిపోయి వత్సా! నేడొక విశేషము పొడకట్టినిది. ఉదరపోషణార్ధము గ్రుమ్మరు సన్యాసులును బైరాగులు నేమివిశేషములు సెప్పగలరు మత్పితామహుడు మిగులవృద్ధుండు పండితుడు పూర్వప్రాయంబున బెక్కు దేశములుదిరిగి పెక్కువిశేషములు చూచినవాడు ఆయనతో బ్రస్తావముగా నీసంగతింజెప్పితిని ఆయనజ్ఞప్తికి దెచ్చుకొని ఆయ్యో! అట్టివిశేషము లెఱింగిన వాడీయూర నొకండుండవలయువాడు బ్రతికియుండెనోలేదో నాకుదెలియదు అతనిపేరు మణివర్మ విశ్వకర్మకులస్థుడు వానితాతదండ్రులనాటినుండియు యంత్రములు సేయుట తంత్రములుబన్ని రూపములు మార్చుటలోనగు శక్తుల వాని యింట గలిగియున్నవి. వానితాత విశ్వకర్మయంతవాడు కీలుజింక నొకదానిఁ జేసి గగనమార్గంబున దిరుగువాడట. అదియు వానియింటనే గుప్తముగా నుండవచ్చును. మణివర్మ నాకన్న చిన్నవాడు వాని తండ్రియు నేను నొకప్రాయమువారము అతని సహవాసమున నేను దఱచు వారియింటికిబోవువాడ దానించేసి యీరహస్యములు నాకు మాత్రమే తెలియును. మణివర్మతండ్రి కాలముచేసిన తరువాత నేను వారి యింటికిబోవుట మానివేసితిని తరువాత నాత డిప్పు డెట్లున్నవాడో తెలియదని యా వృత్తాంతమంతయుం జెప్పెను అప్పుడు నేను మిగుల సంతసించుచు నమ్మణివర్మ వృత్తాంత మరయుటకై యీపట్టణ మంతయుం దిరిగి చివరకు వానియిల్లు గనుగొంటిని. అది రాజభవనమువలె జుట్టు నున్నతమైన గోడ గలిగి యున్నది. లోపల మిక్కిలి విశాలముగానున్నదట మణివర్మ జీవించియేయున్నవాడు. వాడు యిల్లువిడచి యెన్నడును బైటికిరాడట. పిత్రార్జితమైనధనము లక్షలకొలది యున్నదట. లోపలి కతనియానతిలేక పోవశక్యము కాదు. తలుపు లెప్పుడును మూసియే యుండునట. ఇంతవరకు దెలిసికొనుటకు రెండుమూడు దినములు పట్టినది ఇంతకన్న నెక్కుడు తెలిసినవారుసు జెప్పినవారును లేరు. నీవు మిగుల బుద్ధిమంతుడపు వానింగలిసికొని యా జింకను సంగ్రహించితివేని నీయభీష్టము కొనసాగును. అనిచెప్పి ఆతండరిగెను.