పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుభధ్రకథ

77


సుభద్రకథ

పిమ్మట నారాజపుత్రుం డక్కార్యంబు హస్తగతప్రాయంబుగా దలంచుచు మఱిరెండు వాసరము లఱిగిన వెనుక సమయము జేసికొని యొక్కనాడు సాయంకాలమున నొక్కరుఁడ బయలు వెడలి యొడలంతయు మలినపు వలువం గప్పికొని సామాన్యపురుషుడువలె దోచుచు ప్రజల నడిగి తెలిసికొని అమ్మణివర్మ యింటిదాపునకు బోయెను.

ఆ యింటిప్రహరియు సింహద్వారమును జూచుచు వెఱగుపడి ఓహో! వీని యింటిలోనికి బోవుటయే దుర్ఘటమని తోచుచున్న యది గుప్తముగా దాచినయాజింక యెట్లు లభ్యమగును వీడు ద్రవ్యసాధ్యుడు కాడు. దైవానుకూల్య మెట్లున్నదో తెలియదని తలంచుచు అందున్న వారిని మణివర్మతో మాటాడవలసి యున్నది. లోపలికి బోవచ్చునా? అని అడిగెను.

వారు అయ్యో! మణివర్మ యీ పట్టణపు రాజు వచ్చినను దర్శనం బియ్యడు నీ వెవ్వడవో యెఱుగనివాడవు గనుక అట్లడిగితివి. పోపొమ్ము, నీకు మణివర్మతో మాట్లాడుట యీ జన్మమునకు శక్యము కాదనిచెప్పిరి ఆ మాటలు విని అతండు, మనంబు దిగులువడ గర్తవ్యమేమి అని ఆలోచించుచు అందే యొకచోట గూర్చుండెను. ఇంతలో మణివర్మ యింటి పెరటిగుమ్మము తెరచుకొని యొక ముసలివాడు ఈవలకు వచ్చెను.

ఆ రాజకుమారుండు వానితో గొన్ని అడుగులు నడచి వెనుకకుజీరి యోరి, నీ పేరేమి? మీ యిల్లు యెందున్నదని అడిగిన వాడు కోపదృష్టిం జూచి నీ వెవ్వడు నన్నోరి యని పిలిచెదవు! నీకన్న తక్కువ వాడననుకొంటివా యేమి? అంతరము తెలసి మాట్లాడుమని చెప్పెను

అప్పుడా నృపనందనుండు లోన నవ్వుకొనుచు నోయీ! నీకు గోపమువలదు ప్రమాదముచే అట్లు వచ్చినది. నీతో గొంచెము పని యుండియే అడిగితిని. మొదటనే త్రోసివేసిన నెట్లు నే నడిగినమాటలకు సదుత్తరమిచ్చిన నీకు మంచిపారితోషిక మిచ్చెద. నమ్మకములేదేని ముందుగా నీ నాణెమును బుచ్చుకొనుమని చెప్పి యొక దీనారము చేతిలో బెట్టెను.

ఆ ముసలివాడు సంవత్సరము పాటుపడినను అంత ద్రవ్యము సంపాదింపలేదు. దానింజూచుకొని మిక్కిలి సంతసించుచు, బాబూ! నీవెవ్వరవో గొప్పవాడవు వలె దోచుచుంటివి. నీ వేషమునుబట్టి తిరస్కరించితిని. నాతప్పుసైరింపుము నావలన నీకేమి ప్రయోజన మున్న దియో చెప్పుము నాయోపినంత జేయుదును. మా యిల్లీ ప్రాంతమందే యున్నది. నా పేరు రామిరెడ్డి. నేను మణివర్మగారి యింటిలోనే పని చేయుచుందును. నెలకు నేబది కుంచముల ధాన్యమునిచ్చును. చిన్ననాటనుండియు నన్ను వారే పోషించుచుండిరి. యిదియే నా వృత్తి అని చెప్పెను.