పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

కాశీమజిలీకథలు - మూడవభాగము

దొడంగిరి. అట్లు రెండుక్రోశములు దూరముపోవువరకు నొక మహారణ్యము పొడచూపినది.

పట్టపగలయినను వెఱపుగొలిపెడు యక్కాంతతారమున చీకటిపడుచున్నదను భయమింతయుఁ బూనక వారు కొంతదూరము వెడలినంత నాప్రాంతమందు విశాలమగు మఱ్ఱిచెట్టొకటి గనంబడినది.

అది భూనభోంతరాళములను శాఖోపశాఖలచే వ్యాపించి బ్రహ్మాండంబు నాక్రమింప విజృంభించి వింధ్యాద్రివోలె ననంతమై మొదలుకన్న లావుగలిగిన యూడలు వేనవేలు బలీయఁ బ్రతాంతరిత ఫలికాండంబు లరుణకనీలిక ప్రకారంబు సూచింప సహస్ర పద్మాక్షుండైన విశ్వరూపు ననుకరించి యొప్పుచుండెను.

ఖరకర భయంబున వెఱచివచ్చి తన్ను శరణుజొచ్చిన చీకటుల కభయ మిచ్చి రక్షించుచున్నట్లు, తదంతరముల మిట్టమధ్యాహ్నముసైత మంధకార మాశ్రయించి యుండును. లక్షలకొలది జను లొండొరులకు దెలియకుండ దాగి యుండవచ్చును. తస్కరులు గ్రామములు దోచికొనివచ్చి స్తేయంబులు దానిక్రింద విస్రబ్దముగా పంచుకొనుచుందురు. భూతభేతాళములందు నిరంతము నాట్యమాడు చుండును. క్రూరసత్వంబుల కాచెట్టునీడ యాలపట్టు పతంగసంతతికి నిశాంతము క్రూరవ్యాళములకు విహారభూమియై యొప్పుచున్న యావృక్షమునుజూచి యవ్విరాగులు నలువురును వెరపులేని వారగుటచే నది తమకు నివసింప నుచితప్రదేశమని తలంచుచు నూడలూతగాబూని కొమ్మలపై కెక్కి విశాలముగానున్న తచ్చాఖాంతరంబులఁ దలయొకచోటను బండుకొని యచ్చటివిశేషముల చూచుచుండిరి.

అంతలో నిరువురు తస్కరులొక బంగారుగంపను మోసికొని వచ్చి యాచెట్టుక్రింద దింపి యొండొరులిట్లు సంభాషించుకొనిరి.

స్థూలజంఘుడు - అయోముఖా ! ఈ చిన్నది నిద్రబోవుచున్నదా యేమి? ఎంత కుదిపినను లేవకున్నది. ఎత్తునుండి విసురుగా బడుటచే నలసట జెందియున్నదని తలంచెదను.

అయోముఖుడు -- కావచ్చును. కాని దీని రూపము చిరుతతనము సూచించు చున్నది. నేను భార్యలేనివాడనుగదా. తొడవులన్నియు మీరు దీసికొని దీని నాపాలిగా విడువుడు

స్థూలజంఘుడు - ఇప్పుడు నేనేమి చెప్పుదును. శంబరాక్షునభిప్రాయ మెద్దియో తెలియదు. మనయిరువురను వెలుపల నిలువబెట్టి వాడు కోటలోనికింబోయి దీని గంపలోనిడి దిగవిడిచెనుగదా మఱియేమి తేబోయెనో తెలియదు. వానిమాట గైకొనకయే మన మీమూట తీసికొని వచ్చితిమి. దీనిమాట పిమ్మట విమర్శింతము వాడింకను రాకున్నవాడు దీనినీతొఱ్ఱలోనిడి యచ్చటికిపోవుదము రమ్ము.

అయోము - దీనికి తెలివివచ్చిన పాఱిపోగలదు. నేనిందుండెదను. నీవు పోయి చూచిరమ్ము.