పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఆయార్తి యెట్టిదో చెప్పుము. వైద్యులం బిలిపింతునా" అని అడిగిన అదియు దాని చిత్తవృత్తి యెఱింగినది కావున అతని కిట్లనియె.

అయ్యా! యిప్పుడెవ్వరు వచ్చినను రానీయవద్దని నాతోఁ జెప్పి పరుండినది. గాఢముగా నిద్రబోయినది. ఉదయంబున అన్నియు విమర్శింపవచ్చును. ఆ మంచముమీద బవ్వళింపుడు. లేపుటకు వలను కాదని చెప్పగా సిగ్గుపడి అందుఁ బరుండి యిట్లు తలంచెను.

అయ్యో! నాకిదియేమి కర్మము! ధరణిఁ బాలించు చక్రవర్తి కుమారుఁడనై కామహతకుని మూలమునగదా యీమూల బరుండవలసి వచ్చినది. ఈతుచ్ఛురాలికారణముననే ప్రాణమువంటి మిత్రునితోడను, భార్యతోడను విరోధముబెట్టుకొంటిని ఇప్పుడు నా గౌరవము తలఁపక నన్నింత దుర్గంధప్రదేశమునఁ బరుండ నియమించినది. అతిపరిచయము వలన అపజ్ఞత వచ్చుననుమాట తప్పునా? కానిమ్ము. ఈరాత్రి మాత్ రమెట్లో సహించి రేపు నా భార్యయింటికే పోయెదను. అది గ్రుడ్డిదని చెప్పిన మాట దీని కల్పితమేమో! ఏమైనను, యిక దీని యింటికి రాదగదని మనము చివుక్కుమన బెక్కుతెఱంగుల దలపోయుచుండ అంతలో నిద్రపట్టినది. మఱియొక్కింతసేపునకు మెలకువ వచ్చి కన్నులు దెఱచి చూచునంత నక్షత్రములు గనబడినవి.

అట్లే చూచుచు నిది యేమి చోద్యము! నే ననంగచంద్రిక యింటిలో బరుంటినే. పయికప్పు ఏమైనది చుక్కలు గనంబడుటకు గారణమేమియని యాలోచించుచున్న సమయమున నతనికి నొండొరులు మాటాడుకొనుచున్న మాట లిట్లు వినంబడినవి.

భీరుఁడు - ఒరే మారేసూ! ఈయన యెవ్వడురా ఈ బోగముదానికి యీయనకు విరోధమెందుకు వచ్చిందిరా.

మారేసు - భీమా! ఈయనే మనరాజుగారి ఆఖరికొడుకురా పాపము వెఱ్ఱిబాగులోడు ఉన్నడబ్బంతా తెచ్చి ముండ కిచ్చేడు యిప్పుడియ్యడములేదు గాబోలు. నూతిలో బారవేయు మని నాకు జెప్పినది బోగమోళ్ళకు నీతి యున్నదా?

బీమ - ఒరే: ఈ యనకు పెండ్లాముండాదా?

మారేసు - ఈయన పెండ్లామేకాదా, భేమ్మలకు ధానధమ్మాలు చేస్తూంటాది. దాన్ని విడిచినందుకు యీయన కీశాస్తి కావలసిందే

భీమ - ఈబోగంది మన కే మిస్తానన్నది?

మా - వెనుకటి మామూలే యున్నది. ఇప్పుడు వేఱే అడుగనక్కరలేదు.

భీమఁ - ఇదివర కెవ్వరినైనా నా తీసికొనిబోయినావా యేమి?

మా - ఆయ్యో! నీవెఱుఁగవు: ఇదివఱకు ధర్మడు కొన్నాళ్ళునకు లేసుగాడు కొన్నాళ్ళు వచ్చేవారు ఆళ్ళూరికి బోతే ఇప్పుడు నిన్ను బిలిచినాను. దీనితల్లినాఁట నుండియు నీ పని మేము చేయుచున్నాము. ఈలాటి రాజకుమాళ్ళకు పదురుగు దీసికొనిపోయి ఆనూతిలో బారవేసితిమి.