పుట:Kanyashulkamu020647mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

కన్యాశుల్కము

తృతీయాంకము

1-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు యింట్లో సావిట్లోగది.

[మధురవాణి ప్రవేశించును]

మధుర: యీ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది. భూవుఁలన్నీ తాకట్టుపడి వున్నాయిట మరి రుణంకూడా పుట్టదట వాళ్ళకీ వీళ్ళకీ జుట్లుముడేసి జీవనం జేస్తూన్నాడు, యీ వూరు వేగం సవిరించి చెయ్‌ చిక్కినంత సొమ్ము చిక్కించుకుని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి (పాడును) ‘తెలియక మోసపోతినే, తెలియక ’ (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును.)

రామ: యేవిఁటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిఁటి, పాడూ.

మధుర: తరవాత ముక్కకేవుఁంది. మిమ్మల్ని నమ్మి మోసపోయినాను.

రామ: అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్ణయప్రకారం రెండొందలూ పట్ణంలో యిచ్చాను. నెల జీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోసవేఁవుంది?

మధుర: యేంచిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ, నాకు డబ్బే ప్రధానవైఁనట్టు మీ మనసుకి పొడగడుతూంది కాబోలు, నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుఁలు రుణాక్రాంతవైఁనాయని అప్పట్లో నాకు తెలిశుంటే మీ దగ్గిర రెండొందలూ పుచ్చుకొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగుచేసుకోక పోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకుని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ఠ. మా యింటి సాంప్రదాయం ఇది పంతులుగారూ అంతే గాని లోకంలో సాన్లమచ్చని వూహించకండి.

రామ: భూవుఁలు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం యవరన్నారోగాని నేను మహరాజులా వున్నాను.