భీమా- చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగు గడుపుతూవచ్చేవారు.
కలె- ఆఫీస్పనిచూసుకుని పిల్చేవరకూ ఉండండి.
అగ్నిహో- (రామప్పంతులుతో) యేమండోయ్ మన కొత్తవకీల్ని కోప్పడుతున్నారే?
రామప్ప- (అగ్నిహోత్రావధానులుతో) యీ అధికార్లనైజం యేమిటంటే యెవళ్లమీద దయవుండి యెవళ్లపక్షం కేస్చెయ్యాలంటే వాళ్లని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోరట్లసంగతంతా తెలుసునంటారే? యిదేనా మీఅనుభవం?
అగ్నిహో- (గట్టిగా) అవునవున్నాకు తెలుసును.
కలె- యెవరా మాట్లాడుతున్నమనిషి?
నాయడు- (లేచి) తక్షీర్ మాఫ్చేస్తే మనవిచేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారంకాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లుగారు; మహా (అ)యోగ్యమైన బ్రాహ్మడు, జటాంతస్వాధ్యాయి, యీయనే లుబ్ధావధాన్లుగారికి తన కొమార్తెను పద్ధెనిమిదివందల రూపాయిలకు కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ధిచేశారు; అందుకే యీమధ్య లుబ్ధావధాన్లుగారు యేలినవారి కోర్టులో ఛార్జీ దాఖలుచేశారు. అందులో ముద్దాయీ యీ మహానుభావుడే! మల్లవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణశ్రేష్టుడుంటే, ఆయనకు తన పెద్దకుమార్తెను కన్యాదానంచేసి, రెండుపిల్లికూనలు స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడిపుణ్యం అంతామూడి పరంపదం వీంచేశాడు. ఆపిల్లదాని తరఫున భూములకొరకు దావాతెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంట్ ఆఫీసర్లకి తరుచుగా పనిగలుగచేసి ప్లీడర్లని పోషిస్తూవుంటారు, వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి, మరియెన్నడమునకు శేషుడికైనా అలవికాదు. వారితరఫున కేసు దాఖలుచెయ్యడంకోసమే భీమారావు పంతులుగారు కోర్టుకు దయచేశారు. (విరసముగా నవ్వి కూరుచొనును.)
కలె- బలే శాబాష్ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులుగార్ని ప్రియాదు అర్జీ దాఖలుచేయమను. (గుమాస్తా పుచ్చుకొని దాఖలుచేయును.)
కలె- (కాగితమందుకొని) యేమిటయ్యా కేసుస్వభావం?
భీమా- చిత్తం, యీయన వెధవకొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనేఆయన అలంకారాలూ, ఆస్తితోకూడా లేవతీసుకు వెళ్లిపోయినాడు.
అగ్నిహో- దస్తావేజులూ, కోర్టుకాయితాలూ కూడానండి.
కలె- యేమిటి! ఆ, హా, హా, హా, హా, (నవ్వుచు బూట్సునేలపైతట్టును) బలే శాబాష్ (అర్జీచూచుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు?