భీమా- తహస్సీల్దార్గారిదగ్గిర నేరంజరిగిన మూడోరోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావుపంతులుగారు, ఛార్జీ దాఖలుచేస్తే ఆ తహస్సీల్దారుగారు కేస్ స్వభావం యేమిటని అడిగినారు. ఎబ్డక్షన్ అని వెంకట్రావు పంతులుగారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడంచాత, తహస్సీల్దారుగారు ఆమాటయెప్పుడూ విన్లేదనిచెప్పారు. తరవాత కేస్ స్వభావం తెలుగునచెప్తే యీలాటినేరం మా జూరిస్ డిక్షన్లో జరగదు, తోవలో రోడ్డుమీద యేతాలూకా సరిహద్దులో యెత్తుకుపోయినాడో అని అర్జీ దాఖలుచేసుకున్నారుకారు. లుబ్దావదాన్లుగారి కూనీకేసు కామాప్చేసిన తహస్సీల్దారుగారే యీయనండి.
నాయుడు- ఇంగ్లీష్రాకపోతేనేమండి? తహస్సీల్దారుగారు యెంతప్రాజ్ఞులు. పూర్వపు యూరోపియన్ అధికార్లని యెంతమందిని మెప్పించారు! ఆయన లుబ్ధావధాన్లుగారి కేసు కామాప్చేశారని భీమారావు పంతులుగారు అంటున్నారు. యింకా యిన్క్వైరీ అవుతూవున్న కేసులో అలా అన్నందుకు యీయనపైని తహస్సీల్దారుగారు పరువునష్టం ఛార్జీతేవడమునకు వీలువున్నది.
కలె- (భీమారావువైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకు లోపుయీడని రుజువున్నదా?
భీమా- జాతకంవుందండి.
నాయుడు- కోర్టువారు ఆజాతకం దాఖలుచేసుకోవాలి.
భీమా- యీకేసులో ఆయన మాట్లాడుతూవుంటే నే ఎంతమాత్రం వొప్పేదిలేదు.
నాయుడు- యీకేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి (అని దాఖలు చేయును.)
భీమా-(అగ్నిహోత్రావధాన్లుగారితో)ఏమయ్యా యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా.
అగ్నిహో- మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు.
భీమా-(అగ్నిహోత్రావధాన్లుగారితో) అయితే యేడువు.
(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయిచూచును.)
కలె- యేదీ జాతకం దాఖలుచెయ్యండీ.
(భీమారావుపంతులు దాఖలు చేయును.)
నాయుడు- కోర్టువారితో వకసంగతి మనవిచేసుకుంటాను. యీ జాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారుచెయ్యబడ్డది. అదుగో ఆమూల నిలబడ్డ రామప్పంతులుగారికి యీ జాతకంలో మంచిప్రవేశం వుందండి.