పుట:Kanyashulkamu020647mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

కన్యాశుల్కము

సప్తమాంకము


1- వ స్థలము: విశాఖపట్ణంలో వీధి.

(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులూ ప్రవేశింతురు.)

రామన్న- యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ?

బైరాగి- కాశీనుంచిరా.

రామ- యెన్నాళ్లైంది గురూ?

బైరాగి- ప్రాతఃకాలం గంగసేవించి బయల్దేరామురా.

రామ- యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ?

బైరాగి- పవనంబంధించి, వాయువేగం మీదవచ్చామురా.

బుచ్చన్న- యోగులికి సిద్దులుండవురా? యీయనేంరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు.

లక్ష్మన్న- తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా?

బైరాగి- పామరులు! పామరులు!

రామ- వూరుకొస్సి- నీకేటెరిక- యెఱ్ఱినాకొడక.

బైరాగి- యీవూళ్లో తీర్థపురాళ్లరేవున రెండుమైళ్లులోసబురున ధర్మరాజువారు ప్రతిష్ఠచేసిన శివాలయం, కంచుదేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆదేవుణ్ణి శేవించుకుని, రేపు రామేశ్వరం వెళ్లిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది?

రామ- యీ ఊళ్లో మఠంలేదు గురూ. మేవంతుండగ తమకిలోపవేఁటి గురూ? కాశీ కబుర్లేటి గురూ?

బైరాగి- నాలుగురోజులు కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపు రేకు ఆకాశంమీంచి పడ్డది. దానిమీద వ్రాసినలిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయిందికాదు. మేం చిత్తగించాం. సిద్ధులభాషని దానిమీద బంగారంచేసే యోగం వకటి కలకాలంబతికే యోగం వకటి వ్రాసివున్నాయి.