శ్రీ
కన్యాశుల్కము
సప్తమాంకము
1- వ స్థలము: విశాఖపట్ణంలో వీధి.
(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులూ ప్రవేశింతురు.)
రామన్న- యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ?
బైరాగి- కాశీనుంచిరా.
రామ- యెన్నాళ్లైంది గురూ?
బైరాగి- ప్రాతఃకాలం గంగసేవించి బయల్దేరామురా.
రామ- యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ?
బైరాగి- పవనంబంధించి, వాయువేగం మీదవచ్చామురా.
బుచ్చన్న- యోగులికి సిద్దులుండవురా? యీయనేంరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు.
లక్ష్మన్న- తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా?
బైరాగి- పామరులు! పామరులు!
రామ- వూరుకొస్సి- నీకేటెరిక- యెఱ్ఱినాకొడక.
బైరాగి- యీవూళ్లో తీర్థపురాళ్లరేవున రెండుమైళ్లులోసబురున ధర్మరాజువారు ప్రతిష్ఠచేసిన శివాలయం, కంచుదేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆదేవుణ్ణి శేవించుకుని, రేపు రామేశ్వరం వెళ్లిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది?
రామ- యీ ఊళ్లో మఠంలేదు గురూ. మేవంతుండగ తమకిలోపవేఁటి గురూ? కాశీ కబుర్లేటి గురూ?
బైరాగి- నాలుగురోజులు కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపు రేకు ఆకాశంమీంచి పడ్డది. దానిమీద వ్రాసినలిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయిందికాదు. మేం చిత్తగించాం. సిద్ధులభాషని దానిమీద బంగారంచేసే యోగం వకటి కలకాలంబతికే యోగం వకటి వ్రాసివున్నాయి.