అతడు భీమవరంలో వున్న దేశ నాయకుడైన దండు నారాయణరాజుగారి కడకు పోయాడు. నారాయణరాజుగారు అతనికి అనేక విధాల సహాయం చేస్తూ ఉండేవారు.
నారా: నువ్వు బి.ఏ. ప్యాసయినంత మాత్రాన ఊరుకొంటే లాభం లేదు ఎల్లమందా.
ఎల్ల: పై చదువులు చదవడం ఎలా అండి.
నారా: నీ జన్మలో నీకు మెట్లు వుండాలి. మెట్లు ఉండడం మూడు రకాలు. భగవంతుడే ఏర్పరచిన మెట్లు, ఇతర మనుషులు - చుట్టాలో, స్నేహితులో, దయ గలవారో - ఏర్పరచిన మెట్లు; తనకు తానే ఏర్పరచుకొన్న మెట్లు. ఈ చివరరకం మెట్లే ఉత్తమమయినవి.
ఎల్లమంద: అవునండి, ఏం ఏర్పరచుకోను నేను, నేను నిర్మించుకొనే మెట్లూ రెండు రకాలు ఉంటాయండి. నాకోసం మెట్లు కట్టుకొని నేను ఎక్కవచ్చును. నా జాతి కోసం నా దేశంకోసం మెట్లు కట్టుకుని నేను ఎక్కుతూ నాతోపాటు ఇతరులనూ ఎక్కించవచ్చును.
నారా: నీ మాట ఎంతో సమంజసముగా వుంది. నీ కొరకే నువ్వు మెట్లు కట్టుకుంటే, భారతీయ కేంద్ర ప్రభుత్వ సభ్యుడుగా కావచ్చును. నీ జాతి పేరును వాడుకుంటూ, నీ జాతివారినే నీకు మెట్లు చేసుకోవచ్చును. అలాంటి పెద్దలున్నారు. అనేకమయిన పార్టీలు అలాంటివి ఉన్నాయి.
ఎల్లమంద: అవునండి, చివరకు జాతీయ సంస్థ అయి, మహోత్తమమూ, పవిత్రమూ అయిన కాంగ్రెసునే తమకు మెట్లుగా ఉపయోగించుకొనే పెద్దలున్నారు కాదా అండి?
నారా: బాగా అన్నావు ఎల్లమందా! కనక నువ్వు నీచస్థితిలోని నీ జాతిని పైకి తీసుకు వెళ్ళడమా, లేక నీకు నువ్వు బాగుపడడమా నువ్వే ఆలోచించుకోవాలి.
ఎల్లమంద ఇంటికి వెళ్ళినాడు. ఒక రాత్రల్లా నిద్రలేదు. పక్కమీద దొర్లాడు. లేచి వీధిలోకి వచ్చాడు. కుక్కలు అరుస్తున్నాయి. చెడువాసన ప్రపంచమే నిండి వున్నట్లుగా అవుతున్నది.
ఇంట్లో తనవారి చెడు వాసన, చెడు బట్టల వాసన, నీచస్థితి వాసన.
ఆ దుర్గంధం ఏనాటికయినా తన జాతిని వదలదా? తనజాతి నిదురించే ఈ పల్లెపయిన ప్రసరించే చంద్రకిరణాలు సుగంధాల జల్లుతూ ప్రతిఫలించే దినాలు రానేరావా? ఈ దేశానికి సుగతి లేదా?
★ ★ ★
అడివి బాపిరాజు రచనలు - 7
19
నరుడు(సాంఘిక నవల)